మందారం కప్పులో నయనతార తుఫాను

కొద్దిరోజుల క్రితం సమంత ఇన్ఫెక్షన్ తగ్గడానికి నెబులైజర్ లో హైడ్రాక్సిన్ పెరాక్సైడ్ వాడటంలో ప్రయోజనాలు ఉంటాయని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఎంత దుమారం రేపిందో చూశాం. లివర్ డాక్ అనే పేరుతో ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే ఒక ఎంబిబిఎస్ వైద్యులు సమంత ఇలాంటి సలహా ఇవ్వడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సామ్ సైతం ధీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది కానీ ఒకదశ దాటాక ఇద్దరూ సైలెంట్ అయిపోవడంతో ఇష్యూ కాస్త చల్లబడింది. ఇప్పుడు నయన్ వంతు వచ్చింది.

మందారం టీ తాగడం వల్ల బోలెడు ఉపయోగాలు ఉంటాయని, మధుమేహం రక్తపోటు మొటిమలు తదితర ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతుందని, ఆ తేనీరు తయారు చేసుకోవాల్సిన విధానాన్ని కూడా నయనతార షేర్ చేసుకుంది. దీంతో అదే లివర్ డాక్ మళ్ళీ తెరపైకి వచ్చారు. సెలబ్రిటీలలో వైద్య నిరక్షరాస్యులు పెరిగిపోతున్నారని, మందారం టీ తాగడం వల్ల పైన చెప్పిన వ్యాధులకు పరిష్కారం దొరుకుతుందని ఎక్కడ రుజువు కాలేదని చిన్నపాటి క్లాసు తీసుకున్నాడు. ఇది కాస్తా వైరల్ కావడంతో నయనతార కొంత సమయం తర్వాత ఆ పోస్టుని అకౌంట్ నుంచి తీసేసింది.

తన ఆరోగ్య పర్యవేక్షణ చేసే నిపుణుడైన మున్మున్ గనేరివాల్ చెప్పిన సూచనలే పోస్ట్ చేశానని చెప్పిన నయనతార దాన్ని అలాగే మాత్రం ఉంచలేకపోయింది. మెడికల్ గా మందారం టీ మంచిదనే ఆధారాలు లేకపోవడమే దానికి కారణం. తర్వాత మూర్ఖులతో వాదిస్తే వాళ్ళ స్థాయికి మనల్ని కిందకు లాగుతారని అర్థం వచ్చేలా ఒక కొటేషన్ పెట్టిన నయన్ మొత్తానికి శుభం కార్డు వేసింది. అయినా సిగరెట్లు మందు తాగమని, ఆన్ లైన్లో పేకాట ఆడమని యాడ్లు చేసే హీరోల కన్నా ఇలా హెల్త్ కు సంబంధించిన సలహాలు ఇచ్చే హీరోయిన్లు చేసింది తప్పెలా అవుతుందని ఫ్యాన్స్ వాదన.