వైసీపీకి చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న శ్వేత‌ప‌త్రాలు.. !

ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన శ్వేత పత్రాలు వైసీపీలో గుబులు రేపుతున్నాయి. చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాయి. ఇసుక, మైనింగ్ తదితర అంశాల్లో జిల్లాల స్థాయిలో అనేకమంది వైసీపీ నాయకుల పాత్ర ఉంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. పైకి ఎవరికివారు తాము నిమిత్తమాత్రులమని తమకే పాపం తెలియదని చెబుతున్నారు. కానీ మైనింగ్, ఇసుక‌, ఎర్రమట్టి వంటి విషయాల్లో వైసీపీ నాయకులు బాగానే సొమ్ములు చేసుకున్నారు. ఇప్పుడు ఆ విషయాలను అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టిన చంద్రబాబు.. వాటిపై విచారణ చేయిస్తామని చెప్పారు.

సహజంగానే ఇది వైసీపీ నాయకులకు కంటిపై నిద్ర లేకుండా చేస్తుంది. వాస్తవానికి ఎవరూ పట్టించుకోరని, మ‌ళ్లీ మ‌రోసారి త‌మ‌ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని నాయకులు అంచనా వేసుకున్నారు. చాలా జిల్లాల్లో కోట్ల రూపాయల విలువైన సంపదను సొంతం చేసుకోవడం, అక్రమంగా ఆస్తులు పోగేసుకోవడం వంటివి జరిగిపోయాయి. వీటి వివరాలను అసెంబ్లీలో వెల్లడించిన ముఖ్యమంత్రి త్వరలోనే వీటన్నింటి విషయాలను వెలుగులోకి తెస్తామని, అక్రమార్కులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

దీని పర్యవసానం రెండు రకాలుగా మారింది. ఒకటి) వైసీపీలో ఉండి ఆ కేసులను ధైర్యంగా ఎదుర్కోవటం అవసరమైతే జైలుకు వెళ్లాల్సి వచ్చినా వెళ్లడం. రెండోది) ఈ గోలంతా ఎందుకులే అనుకుంటే ఏదో ఒక రకంగా తమకు రక్షణ కల్పించే పార్టీలోకి మారిపోవడం. సాధారణంగా ఇట్లాంటి విషయాలు వెలుగులోకి వచ్చినప్పుడు నాయకులు జైలుకు వెళ్లేందుకు, కేసులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా అయితే ఎవరూ ఉండరు. సాధారణంగా పార్టీలు మారిపోతున్నారు. అటు కేంద్రంలో చూసినా ఇటు రాష్ట్రాల్లో చూసినా… గత పది ఏళ్ల‌ కాలంలో వందల మంది నాయకులు పార్టీలు మారిపోయారు.

తద్వారా వారిపై ఎలాంటి కేసులు రాకుండా, అక్రమాలు వెలుగు చూడకుండా మేనేజ్ చేసుకోగలుగు తున్నారు. ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే వైసిపిలో నాయకులు కేసులు ఎదుర్కోవాలి. ఇదే జ‌రిగితే.. దాదాపు నాలుగున్నర సంవత్సరాల పాటు వారు కోర్టులు, కేసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. పైగా వారి వారి నియోజకవర్గాల్లోనూ బ్యాడ్ అయిపోతారు. అదేవిధంగా లక్షల రూపాయలు వెచ్చించి లాయర్లను పెట్టుకోవటం, కేసులను వాదించుకోవడం ఇవన్నీ పెద్ద తలనొప్పిగా మారుతాయి.

పోనీ పార్టీ అధిష్టానం నుంచి ఏదైనా సహకారం ఉంటుందా? అని చూస్తే అది కూడా తక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు టార్గెట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇదే జరిగితే ఇప్పటికే ఉన్న కేసులతోపాటు లిక్కర్, మైనింగ్, ఇసుక వంటి కేసులు కూడా జగన్‌ తట్టుకోవ‌డం క‌ష్ట‌మ‌వుతాయి. దీంతో తన కేసుల విషయాన్నే జగన్ చూసుకునేందుకు సమయం సరిపోదు. ఇక నాయకుల్ని ఏం పట్టించుకుంటారు అన్న ప్ర‌శ్న ఉంది.

ఈ పరిణామాలను బట్టి చాలామంది నాయకులు పార్టీలు మారేందుకు సిద్ధపడతారని పరిశీలకులు భావిస్తున్నారు. వాస్తవానికి అక్రమాలు చేసినా చేయకపోయినా విపక్ష పార్టీల్లో ఉండేందుకు నాయకులు ఇష్టపడడం లేదు. అధికార పార్టీలో ఉంటే తమపై వేధింపులు లేక‌పోగా.. చిన్న చిన్న కాంట్రాక్టులు అయినా దక్కుతాయని ఎక్కువ మంది నాయకులు భావిస్తున్నారు. మంచివారైనా, ఆరోపణలు ఉన్నవారైనా పార్టీలు మారేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వైసీపీలో కూడా ఇదే పరిస్థితి ఎదురు కానుందని ఒక చర్చ నడుస్తోంది. అయితే ఇది ఇప్పటికి ఇప్పుడు కాకపోయినా వచ్చే రెండు మూడు మాసాల్లో అయినా ఖ‌చ్చితంగా జ‌రుగుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.