వైసీపీ టు ఎన్డీఎ వయా జనసేన !

ఏపీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు పార్టీని వీడి అధికార పక్షంలో చేరడానికి ఆపసోపాలు పడుతున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలను పార్టీలో చేర్చుకోవడానికి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు నిరాకరిస్తున్నాయి. అంతేకాకుండా ఎవరిని పార్టీలో చేర్చుకున్నా మూడు పార్టీల నేతల మధ్య చర్చ జరగాలని, గత ప్రభుత్వంలో ఎలాంటి ఆరోపణలు లేకుండా మంచి వ్యక్తులుగా ఉన్న వారినే చేర్చుకోవాలని నిబంధన పెట్టుకున్నాయి.

ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు టీడీపీ, జనసేన, బీజేపీలలో ఉన్న తమ సన్నిహితులతో ఏ పార్టీలో వీలయితే ఆ పార్టీలో చేరేందుకు పావులు సిద్దం చేసుకుంటున్నారు. అదే సమయంలో పార్టీని వీడేందుకు తగిన కారణాలను కూడా వెతుక్కుంటున్నారు. గుంటూరు జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కని మద్దాలి గిరి పార్టీ అధికారం కోల్పోవడంతో జిల్లా పార్టీ అధ్యక్ష్య పదవికి, పార్టీకి రాజీనామా చేశారు.

ఆ వెంటనే గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ తరపున గుంటూరు ఎంపీగా పోటీ చేసిన రోశయ్య టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతిలో 344695 ఓట్ల భారీ తేడాతో ఓటమి చవిచూశాడు.

అప్పటి నుండి పార్టీ మీద అలకతోనే ఉన్న రోశయ్య తన మామ, వైసీపీ సీనియర్ నేత అయిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు శాసనమండలిలో విపక్ష నేత హోదా ఇస్తారని భావించారట. విపక్ష నేతకు కేబినెట్ హోదా లభిస్తుందన్న ఆశతో ఉన్నా గుంటూరు జిల్లాకే చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి వైసీపీ ఆ పదవిని కట్టబెట్టింది.

దీంతో వ్యూహాత్మకంగా రోశయ్య వైసీపీ రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. అదే సమయంలో తిరుపతి జనసేన ఎమ్మెల్యే, తన వియ్యంకుడు అయిన అరణి శ్రీనివాసులు సహకారంతో జనసేన జెండా ఎత్తుకోవడానికి రోశయ్య ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. తనతో పాటు తన బావమరిది, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు వెంకటరమణను కూడా జనసేనలోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారట. మొత్తానికి ఏదో ఒక విధంగా అధికార పక్షం వైపు చేరాలన్నదే వీరి ఉద్దేశంగా చెబుతున్నారు.