రెడ్ బుక్ రాజకీయం !

కొన్నాళ్లుగా ఏపీలో సంచ‌ల‌నాల‌కు దారి తీస్తున్న ‘రెడ్ బుక్‌’ వ్య‌వ‌హారంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఇటీవ‌ల కూడా.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని కామెంట్ చేసిన విష‌యం తెలిసిందే. రెడ్ బుక్‌లో ఉన్న‌వారిని బ‌త‌క‌నివ్వ‌డం లేద‌ని కూడా ఢిల్లీలో నిర్వ‌హించిన ధ‌ర్నాలో ఆయ‌న పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై తాజాగా నారా లోకేష్ స్పందించారు. రెడ్ బుక్‌లో ఉన్న అంద‌రినీ చ‌ట్ట ప్ర‌కారం శిక్షిస్తామ‌ని.. ఈ విష‌యంలో వెన‌క్కి త‌గ్గేదిలేద‌ని చెప్పుకొచ్చారు. అయితే.. అస‌లు రెడ్ బుక్ తెర‌వ‌కుండానే జ‌గ‌న్ గ‌గ్గోలు పెడుతున్నాడ‌ని అన్నారు.

రెడ్ బుక్ తెరిస్తే.. జ‌గ‌న్ ఏం చేస్తాడో అని నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “అవును. రెడ్ బుక్ నాద‌గ్గ‌రే ఉంది. దానిలో అనేక మంది పేర్లు కూడా ఉన్నాయి. ఎన్నిక‌ల‌కు ముందు నుంచి కూడా చెప్పాను. కొంద‌రు అధికారులు మార్పు దిశ‌గా అడుగులు వేశారు. మ‌రికొంద‌రు త‌మ ప్ర‌వ‌ర్త‌న‌ను మార్చుకోలేదు. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయి. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు చట్టప్రకారం శిక్షిస్తాం. కానీ, రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీ దాకా వెళ్లి గగ్గోలు పెడుతున్నాడు” అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

5 ప్రెస్ మీట్ల లెక్క ఇదీ..

జ‌గ‌న్ త‌ను అధికారంలో ఉన్న‌ప్పుడు కేవ‌లం ఐదంటే ఐదు సార్లు మీడియాతో మాట్లాడార‌ని నారా లోకేష్ అన్నారు. ఐదేళ్ల కాలంలో ఐదు సార్లు మాత్ర‌మే ఆయ‌న‌కు మీడియా క‌నిపించింద‌ని ఎద్దేవా చేశారు. కానీ, ఇప్పుడు 11 సీట్ల‌కే ప‌రిమిత‌మ‌య్యాక‌.. కేవ‌లం నెల రోజుల వ్య‌వ‌ధిలో 5 సార్లు మీడియా ముందుకు వ‌చ్చి.. ఏదేదో చెబుతున్నార‌ని అన్నారు. “జగన్ చెప్పే అసత్యాలేవో అసెంబ్లీకి వచ్చి చెప్తే.. వాస్తవాలు మేం వివరిస్తాం కదా?” అని నారా లోకేష్‌ ప్రశ్నించారు. జగన్ అసెంబ్లీకి వస్తే గౌరవంగా చూసుకుని వాస్తవాలు అర్ధమయ్యేలా వివరిస్తాం అన్నారు.

ప‌ద‌వి ప్లీజ్‌!

మ‌రోవైపు నామినేటెడ్ ప‌ద‌వుల కోసం.. టీడీపీ నాయ‌కులు క్యూ క‌డుతున్నారు. అసెంబ్లీ చివ‌రి రోజు స‌మావేశాలు ముగిసిన అనంత‌రం.. వంద‌ల సంఖ్య‌లో టీడీపీ నాయ‌కులు వివిధ జిల్లాల నుంచి వ‌చ్చి నారా లోకేష్‌ను క‌లుసుకున్నారు. మ‌రికొంద‌రు ఆయ‌న హైద‌రాబాద్‌కు వెళ్తున్న స‌మ‌యంలో గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టులో క‌లిసి విన‌తి ప‌త్రాలు, బ‌యోడేటాను అందించారు. తాము పార్టీ కోసం ఎంతో కృషి చేశామ‌ని.. ప‌దుల సంఖ్య‌లో కేసులు పెట్టించుకున్నామ‌ని.. త‌మ‌ను గుర్తించాల‌ని చాలా మంది నాయ‌కులు నారా లోకేష్‌ను అభ్య‌ర్థించారు. అయితే, పార్టీ కోసం కష్టపడిన వారి సేవల్ని గుర్తుపెట్టుకుని అందరికీ న్యాయం చేస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు.