బీజేపీకి ‘గాడిద గుడ్డు’ సెగ‌!

తెలంగాణ ప్ర‌జ‌లు 8 మంది ఎంపీల‌ను ఇస్తే.. బీజేపీ రాష్ట్రానికి ఏమిచ్చింది.. ‘గాడిద గుడ్డు’! అనే కామెం ట్లు మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చాయి. గ‌తంలోనూ ఒక‌సారి కేంద్ర వైఖ‌రిని నిర‌సిస్తూ.. ఇలానే గాడిద‌గుడ్డు పోస్ట‌ర్లు వెలిశాయి. ఇప్పుడు తాజాగా కేంద్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టిన త‌ర్వాత‌.. తెలంగాణ‌కు రూపాయి నిధులు కూడా కేటాయించ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ.. హైద‌రాబాద్ వ్యాప్తంగా ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో ఇలాంటి పోస్ట‌ర్లే వెలిశాయి.

వీటిని కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఏర్పాటు చేసిన‌ట్టు తెలిసింది. ఈ ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 8 ఎంపీ సీట్ల‌ను బీజేపీ గెలుచుకుంది. ఇది ఎవ‌ర్ గ్రీన్ రికార్డు. దీంతో రాష్ట్రంలో బీజేపీ ప్ర‌భుత్వం ఏదో చేస్తుంద‌ని కూడా అంద‌రూ భావించారు. ప్ర‌ధానంగా ఇద్ద‌రు కేంద్ర మంత్రులు(కిష‌న్ రెడ్డి, బండి సంజ య్) కూడా ఉన్న నేప‌థ్యంలో ఈ సారి ఖ‌చ్చితంగా రాష్ట్రానికి మేలు జ‌రుగుతుంద‌ని లెక్కలు వేసుకున్నారు. కానీ, కేంద్రం నుంచి అలాంటి ఆశావ‌హ ప‌రిణామాలు మాత్రం ఎదురుకాలేదు.

దీంతో కాంగ్రెస్ పార్టీ స‌హా బీఆర్ఎస్‌లు బీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. మ‌రోవైపు ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్రంలో క‌య్యానికి దిగాయి. అధికారంలో ఉండి మీరేం సాధించారంటే.. మీరేం సాధించారంటూ.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేసుకుని.. బుధ‌వారం రోజు రోజంతా కూడా దీనిపైనే స‌భ‌లో చ‌ర్చించుకున్నారు. మాట‌ల తూటాలు పేల్చుకున్నారు. అయితే.. ఇంత జ‌రుగుతున్నా.. బీజేపీ రాష్ట్ర నాయ‌కులు మాత్రం స్పందించ‌లేదు. పైగా రెచ్చ‌గొట్టేలా కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. ఏం రాష్ట్రాల పేర్లు చెప్పాలా? అని నిల‌దీశారు.

ఈ నేప‌థ్యంలో ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చిన రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో దక్కింది ‘గాడిద గుడ్డు’ అంటూ రాసిన బాన‌ర్లు హైద‌రాబాద్‌లోని ప‌లు కూడ‌ళ్ల‌లో క‌నిపించాయి. ఈ ప‌రిణామంపై రాజ‌కీయాల్లోనే కాదు.. సాధార‌ణ ప్ర‌జ‌ల్లో కూడా ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. త్వ‌ర‌లోనే స్థానిక ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో బీజేపీకి ఈ ప‌రిణామం భారీ ఇబ్బందిగా మార‌నుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.