సాయిరెడ్డి ఛానెల్‌కు ముహూర్తం ఫిక్స్.. కీల‌క సీఈవో దొరికాడ‌ట‌!

వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యుడు వి. విజ‌య‌సాయిరెడ్డి త్వ‌ర‌లోనే టీవీ చానెల్‌ను ప్రారంభిస్తానని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల వెలుగు చూసిన దేవ‌దాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ శాంతి, ఆమె బిడ్డ‌కు తండ్రి వ్య‌వ‌హారంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సాయిరెడ్డిని కార్న‌ర్ చేస్తూ.. ఓ చానెల్ ప్ర‌సారాలు చేసింది. డిబేట్లు కూడా పెట్టింది. ఈ నేప‌థ్యంలో బ్లాస్ట్ అయిన‌.. సాయిరెడ్డి.. స‌ద‌రు ఛానెల్పై నిప్పులు చెరిగారు. ఆ వెంట‌నే ఆయ‌న కూడా ఒక ఛానెల్‌ను ప్రారంభిస్తాన‌ని చెప్పారు.

ఇప్పుడు దీనికి సంబంధించిన అప్‌డేట్ ఒక‌టి తెర‌మీదికి వ‌చ్చింది. వైసీపీ నాయ‌కుల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌ల‌ను బ‌ట్టి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుమీదున్న ఓ టీవీ చానెల్ సీఈవో సాయిరెడ్డి చెంత‌కు చేరుకున్నార‌ని తెలిసింది. ఇప్ప‌టికే ఆయ‌న స‌ద‌రు చానెల్‌లో త‌న ప‌ద‌వికి రాజీనామా చేశార‌ని.. దీనికి ఆమోదం కూడా ల‌భించింద‌ని స‌మాచారం. ఇదే విష‌యాన్ని వైసీపీలోని నాయ‌కులు కూడా చ‌ర్చిస్తున్నారు. స‌ద‌రు సీఈవోను సాయిరెడ్డే ‘రాజీ’నామా చేయించిన‌ట్టు కూడా ప్ర‌చారం ఉంది.

అక్క‌డ ఇస్తున్న వేత‌నానికి రెట్టింపు వేత‌నం ఆఫ‌ర్ చేశార‌ని, టీంను సెల‌క్ట్ చేసుకునే బాధ్య‌త‌ను కూడా ఆయ‌నకే అప్ప‌గించార‌ని స‌మాచారం. దీనికి స‌ద‌రు సీఈవో ఆఘ‌మేఘాల‌పై ఒప్పేసుకుని.. బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని.. ప్ర‌స్తుతం సాయిరెడ్డి ఛానెల్‌కు సంబంధించి కార్య‌క్ర‌మాల‌ను కూడా తెర‌వెనుక రేపో మాపో మొద‌లు పెట్ట‌నున్నార‌ని తెలుస్తోంది. ఇక‌, సొంత‌గా చానెల్ ప్రారంభించేందుకు కూడా సాయిరెడ్డి ముహూర్తం పెట్టించుకున్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

అన్నీ క‌లిసి వ‌స్తే.. ఈ ఏడాది ద‌స‌రా(విజ‌య‌ద‌శ‌మి) నుంచి కొత్త చానెల్‌ను ప్రారంభించేస్తార‌ని వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. టీం సెల‌క్ష‌న్‌, స్టూడియోలు.. కెమెరాలు, ఎక్విప్‌మెంట్ అంతా.. ఆఘ‌మేఘాల‌పై పూర్తి చేస్తున్నార‌ని తెలిసింది. అయితే.. ఇప్ప‌టికే వైసీపీ అధినేత జ‌గ‌న్ కు సొంత చానెల్ ఉన్న నేప‌థ్యంలో దానికి పోటీ ఉంటుందా? లేక‌.. స్వ‌తంత్రంగానే సాయిరెడ్డి చానెల్ ఉంటుందా? అనేది చూడాలి. ఏదేమైనా.. ఏర్పాట్లు మాత్రం ప్రారంభ‌మైన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది.