ఒక్కొక్క ఎంపీని వెయ్యి కోట్ల‌కు కొన్నారా?: ష‌ర్మిల

కేంద్ర బ‌డ్జెట్‌లో ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం రూ.15000 కోట్లు కేటాయించిన విష‌యం తెలిసిందే. అదేవిధంగా పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని కూడా.. ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. అయితే.. ఈ బ‌డ్జెట్‌పై కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఫైర‌య్యారు. త‌న‌దైన శైలిలో ఆమె వ్యాఖ్య‌లు గుప్పించారు. “రాష్ట్ర రాజ‌ధాని కోసం 15000 కోట్లు అప్పుగా ఇచ్చారా? గ్రాంటుగా ఇచ్చారా?” అని ప్ర‌శ్నించిన ఆమె.. “15 మంది ఎంపీల‌ను మ‌ద్ద‌తుగా ఇచ్చినందున ఒక్కొక్క ఎంపీకి రూ. వెయ్యి కోట్ల చొప్పున కొనుగోలు చేశారా?” అని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. వాస్త‌వానికి టీడీపీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. మ‌రి ష‌ర్మిల ఏ లెక్క‌న మాట్లాడారో తెలియాలి.

ఇక‌, కేంద్రం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ ను .. బ‌డ్జెట్ కాద‌ని ష‌ర్మిల అన్నారు. ఇది ఎన్నిక‌ల త‌ర్వాత మేనిఫెస్టోగా ఆమె అభివ‌ర్ణించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఈ సారి రూ.ల‌క్ష కోట్లు కావాల‌ని కేంద్రాన్ని కోరిన‌ట్టు ప్ర‌చారం చేసుకున్నార‌ని.. మ‌రి 15 వేల కోట్ల‌తేనే ఎందుకు స‌రిపుచ్చార‌ని ప్ర‌శ్నించారు. పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంపూర్ణ స‌హ‌కారం అని స‌రిపుచ్చ‌డంలో మ‌ర్మమేంట‌ని నిగ్గ‌దీశారు. దీనిని బ‌డ్జెట్‌గా చూడ‌లేమ‌న్న ష‌ర్మిల‌.. మేనిఫెస్టో మాదిరిగా ఉంద‌న్నారు. దీనిలో ఏదైనా చెప్పుకోవ‌చ్చ‌ని.. ఎలాంటి హామీల‌నైనా ఇచ్చుకోవ‌చ్చ‌ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

“బడ్జెట్ అంటే అంకెలు ఉండాలి. కానీ లేవు. ఇది పూర్తిగా ఎన్నిక‌ల త‌ర్వాత మిత్ర‌ప‌క్షాల కోసం విడుద‌ల చేసిన‌ మేనిఫెస్టో. చంద్రబాబు రూ.లక్ష కోట్లు కావాలని అడిగారు. నిజానికి ఏపీకి రూ.12 లక్షల కోట్లు కావాల్సి ఉంది. అయినా.. లక్ష కోట్లు కూడా ఇవ్వ‌లేదు. ఆయ‌న ఎలా అడిగాడో ఆయ‌న‌కైనా తెలుసా?” అని ష‌ర్మిల నిల‌దీశారు. బడ్జెట్ లో కేవలం రాజధానికి నిధులు ఇస్తామని మాత్ర‌మే చెప్పార‌న్న ఆమె.. పోలవరంపై పొగ‌డ్త‌ల‌తో స‌రిపుచ్చార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోల‌వ‌రం పున‌రావాస ఖ‌ర్చే 12 వేల కోట్లుగా ఉంద‌ని.. అలాట‌ప్పుడు కేంద్రం ఎంత ఇస్తుందో కూడా చెప్ప‌క‌పోతే ఎలా అని ప్ర‌శ్నించారు.

“ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ కి ఎంత నిధులు ఇస్తారు? హామీలు ఇస్తే సరిపోతుందా? రూ.500 కోట్లు ఇస్తారా? రూ.5 వేల కోట్లు ఇస్తారా? బడ్జెట్ అంటే అంకెలకు సంబంధించిన విషయం. కానీ ఈ బడ్జెట్ లో కబుర్లు మాత్రమే చెప్పారు. వెనకబడిన ప్రాంతాలకు గ్రాంట్స్ ఎప్పుడు ఇస్తారు. ఎందుకింత న‌ర్మ‌గ‌ర్భ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టారు” అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఏమైంద‌ని అన్నారు. “బిహార్ రాష్ట్రానికి హోదా లేదన్నారు. అస‌లు ఆ రాష్ట్రానికి హోదా ఇస్తామని ఎవరు హామీ ఇవ్వలేదు. కానీ, ఏపీ విభజన సమయంలో ఈ రాష్ట్రానికి హోదా ఇస్తామ‌ని పార్ల‌మెంటు సాక్షిగా హామీ ఇచ్చారు. ఇది ఏమైంది?” అని ష‌ర్మిల నిప్పులు చెరిగారు.