మెడపై కత్తి పెట్టి భూములు రాయించుకున్నారు: చంద్ర‌బాబు

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు మంగ‌ళ‌వారం స‌భ‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గ‌త వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. రాష్ట్రాన్ని దారుణంగా మార్చార‌ని తెలిపారు. మెడ‌పై క‌త్తిపెట్టి భూములు రాయించుకున్నార‌ని.. ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌తో పొరుగు రాష్ట్రాల‌కు త‌ర‌లిపోయార‌ని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో గత ఐదేళ్లు చీకటి రోజులుగా ఉన్నాయ‌ని తెలిపారు. ఎక్కడా భూముల్ని, ఆస్తులను వేటినీ వదల్లేదన్నారు. దౌర్జన్యాలు, విధ్వంసాలు, కబ్జాలు, దాడులు, కేసులు ఒకటి కాదు అన్నీ చూశామ‌న్నారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో వ్యవస్థలన్నీ విధ్వంసం చేశారని చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అహంకారంతో విర్రవీగి అసమర్థతతో వ్యవస్థలు నాశనం చేశారని అన్నారు.

బ‌డ్జెట్ వాయిదా వేయాల‌నుకున్నాం..
బ‌డ్జెట్‌ను వాయిదా వేయాల‌ని భావించినట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. ఆర్ధిక ఇబ్బందుల వల్ల బడ్జెట్ కూడా పెట్టుకోలేని పరిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. మ‌రో రెండు నెలలు సమయం తీసుకుని బడ్జెట్ పెట్టాలనే ఆలోచనకు వచ్చిన‌ట్టు చెప్పారు. వికసిత్ భారత్ -2047కు ప్రపంచంలోనే భారత్ మొదటి లేదా రెండో స్థానానికి వస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు. ఆదిశ‌గానే ఏపీని ముందుకు న‌డిపించాల‌ని సంక‌ల్పం చెప్పుకొన్న‌ట్టు తెలిపారు. విజన్ -2020 తయారు చేశాక అభివృద్ధి ప్రారంభించామ‌ని, ఆనాటి సంక‌ల్పం కొన‌సాగి ఉంటే.. ఏపీ అభివృద్ధి సాకారం అయి ఉండేద‌ని తెలిపారు.

ఊహించ‌ని ఫ‌లితం
జూన్ 4న వెలువడిన ఫలితాలను ఎవ‌రూ ఊహించ‌లేద‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఈ ఫ‌లితాలు ప్రజా చైతన్యానికి నిదర్శనంగా నిలిచాయన్నారు. 93 శాతం స్ట్రైక్ రేట్ సాధించి.. 57 శాతం కూటమికి ఓట్లు పడ్డాయని చెప్పారు. త‌న‌ రాజకీయ జీవితంలో ఏ రాజకీయ పార్టీకి ఇలాంటి ఫలితాలు వ‌చ్చిన‌ట్టు తెలియ‌ద‌న్నారు. గత ఐదేళ్లు చాలా ఇబ్బందులు పడ్డామ‌ని తెలిపారు. తాను జైల్లో ఉండ‌గా జైలుకు వచ్చి పవన్ కల్యాణ్ త‌న‌ను పరామర్శించారని, క్లిష్ట సమయంలో ఓటు చీలకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో పవన్ ముందుకొచ్చారని తెలిపారు. రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి చేసేవరకు సమిష్టిగా ముందుకెళ్తామ‌ని తెలిపారు. రాష్ట్రంలో అరాచ‌క పాల‌న‌ను అంతం చేసేందుకు ఎంతసేపైనా ఓపిగ్గా ఉండి ఓటు వేసి గెలిపించిన అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాన‌ని చంద్ర‌బాబు అన్నారు.

కేంద్రానికి ధ‌న్య‌వాదాలు..

కేంద్ర బ‌డ్జెట్‌లో రాష్ట్రానికి జ‌రిగిన కేటాయింపుల‌పై చంద్ర‌బాబు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, పారిశ్రామిక రంగాలకు కేటాయింపులు జ‌ర‌ప‌డంతో అభివృద్ధి ప‌రుగులు పెడుతుంద‌ని తెలిపారు. రాష్ట్ర ప్రజల తరపున ప్రధాని మోడీ, నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపారు. అమరావతికి కేంద్రం రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇస్తామ‌ని పేర్కొన్నార‌ని.. మళ్లీ మంచి రోజులు ప్రారంభమయ్యాయన్న ఆశ వచ్చిందని చంద్ర‌బాబు అన్నారు.

బాబాయి కేసు..

మాజీ సీఎం జ‌గ‌న్ బాబాయి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసును గురించి చంద్ర‌బాబు మాట్లాడుతూ… “హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలో జవాబు వస్తుంది. వివేకా హత్య కేసు పలు మలుపులు తిరిగింది. వివేకా హత్య జరిగాక ఘటనాస్థలికి సీఐ వెళ్లారు. సీబీఐకి విషయం తెలపడానికి సీఐ సిద్ధపడ్డారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి సీఐకి పదోన్నతి ఇచ్చింది. అయినా స‌రే త్వ‌ర‌లోనే ఈ హ‌త్య వెనుక ఎవ‌రున్నారో బ‌య‌ట‌కు వ‌స్తుంది” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.