ఏపీకి ఇచ్చినందుకు బాధ లేదు-కేటీఆర్

ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ మీద ఏపీ ప్రధాన ప్రతిపక్షం నుంచి పెద్దగా స్పందనే లేదు. కానీ తెలంగాణలో ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం గట్టిగానే మాట్లాడింది. తమ పార్టీ నేతలతో కలిసి ప్రెస్ మీట్ పెట్టిన మాజీ మంత్రి కేటీఆర్.. బడ్జెట్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు గుండు సున్నా ఇచ్చారంటూ ఎన్డీయే ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఈసారి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌‌తో పాటు బీహార్‌కు పెద్ద ఎత్తున కేటాయింపులు జరిగిన సంగతి తెలిసిందే.

దీని గురించి కేటీఆర్ ప్రస్తావిస్తూ.. ఇది ఏపీ-బీహార్ బడ్జెట్లాగా ఉందని ఎద్దేవా చేశారు. అదే సమయంలో ఏపీకి నిధులు, ప్రాజెక్టులు ఇచ్చినందుకు తమకు బాధ లేదని.. కానీ తెలంగాణను విస్మరించడమే తీవ్ర వేదన కలిగిస్తోందని అన్నారు. మొత్తం బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ అన్న పదమే ప్రస్తావనకు రాకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. బీజేపీ తరఫున తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా.. రాష్ట్రానికి దక్కిన ప్రయోజనం శూన్యమన్నారు.

‘‘బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు, ఇద్ద‌రు కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా పార్లమెంట్‌లో మాట్లాడ‌లేదు. ఇదే గులాబీ కండువా కప్పుకున్న ఎంపీలు పార్లమెంట్‌లో గనుక ఉంటే కేంద్ర వ్యతిరేక వైఖరిని గట్టిగా వ్యతిరేకించే వాళ్ళు. 8 మంది ఎంపీలను ఇచ్చినా బీజేపీ ప్రభుత్వం గుడ్ను సున్నా నిధులు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు.

ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ఎక్కువ ఇచ్చినందుకు మాకు ఏం బాధ లేదు. సోదర రాష్ట్రంగా వారికి వచ్చిన కేటాయింపులపైన, వారు బాగుండాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పిన ప్రతిసారి ఎక్కడ కూడా తెలంగాణ ఆనే పదం ప్రస్తావించలేదు. పునర్విభజన చట్టం అంటే తెలంగాణ కూడా అందులో భాగమే. కానీ మా రాష్ట్రానికి ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదు.

ఏపీ రాజధాని అమరావతి కోసం, పోలవరంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామని చెప్పారు. ఏపీ ఇండస్ట్రీయల్ కారిడార్లకు ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన భారీ నిధుల పట్ల మాకు ఎలాంటి దుగ్ధలేదు.. సంతోషమే. కానీ ఆంధ్రప్రదేశ్, బీహార్‌కు మాత్రమే ఇచ్చి మిగిలిన 26 రాష్ట్రాలను చిన్న చూపు చూడడం నిజంగా బాధాకరం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పిన మీరు తెలంగాణ రాష్ట్ర డిమాండ్లను మాత్రం పట్టించుకోలేదు’’ అని కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు.