కేసీఆర్ ఎంట్రీ ఖాయమయ్యింది ?!

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలకు అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఈ రోజు తెలంగాణ భవన్ లో పార్టీ శాసనసభా పక్ష నేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

శస్త్రచికిత్స నేపథ్యంలో గత శాసనసభ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. ప్రతిపక్ష నేతగా ఉండి సమావేశాలకు హాజరు కావడం లేదని, శాసనసభలో తాము నిలదీస్తామనే కేసీఆర్ పారిపోతున్నారని సీఎం రేవంత్, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేఫథ్యంలో నేటి నుండి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరుకానున్నారన్న వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి.

ముఖ్యంగా శాసనసభ సమావేశాలలో నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్, ఫీజు రీ ఎంబర్స్ మెంట్, శాంతిభద్రతలు, మూసీ ప్రక్షాళన, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతు రుణమాఫీ, రైతుభరోసా అమలుతో పాటు కాంగ్రెస్ ఎన్నికల హామీలు ఆరుగ్యారంటీల అమలు మీద నిలదీయాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. ఇక ప్రభుత్వంలో అవినీతిపై ప్రశ్నించేందుకు బీజేపీ సిద్దం అవుతుంది. వీటన్నింటినీ కాంగ్రెస్ పార్టీ ఎలా తిప్పికొడుతుందో వేచిచూడాలి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో సారి సమావేశాలు జరుగుతుండడంతో అధికార పార్టీగా కాంగ్రెస్ సక్సెస్ అవుతుందా ? లేదా ? అన్నది ఉత్కంఠ నెలకొన్నది.