‘నాడు-నేడు’పై విచారణ: మంత్రి లోకేష్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో తొలిరోజు సభ ముగిసింది. ఈ రోజు సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దాంతోపాటు సభలో 2 ప్రభుత్వ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ రిపీట్ బిల్ 2024, డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సవరణ బిల్లు 2024 లను సభ ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో నాడు-నేడు కార్యక్రమంలోని అవినీతిపై ప్రశ్న వచ్చింది.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో నాడు-నేడు పేరుతో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని లోకేష్ ప్రకటించారు. నాడు-నేడు పనులపై విచారణ జరిపి నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రభుత్వ బడుల్లో ప్రమాణాలు పెంచుతామని, ప్రభుత్వ పాఠశాలలను కాపాడతామని లోకేష్ చెప్పారు. నాసిరకం పనులపై విచారణ జరిపిస్తామని, అక్రమాలకు బాధ్యులైనవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని లోకేష్ హెచ్చరించారు. వచ్చే ఏడాది నుంచి విద్యావ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని లోకేష్ చెప్పారు. అత్యుత్తమ విద్యా విధానాన్ని తీసుకువస్తామని, ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేటు స్కూళ్లకు దీటుగా డెవలప్ చేస్తామని చెప్పారు. టీచర్ల సంఖ్య పెంచేందుకే మెగా డీఎస్సీ వేశామని చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పేరుతో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ప్రస్తావించారు. కేంద్రీకృత కొనుగోళ్లతో వైసీపీ భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడిందని, పాఠశాల కమిటీల పేరుతో వైసీపీ నేతలు దోపిడీకి తెరలేపారని అన్నారు.