ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ర‌ద్దు: అసెంబ్లీ ఏక‌గ్రీవ ఆమోదం!

ఎన్నిక‌ల‌కు ముందు తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అయిన‌.. ల్యాండ్ టైటింగ్ యాక్ట్ బుట్ట దాఖ‌లైంది. ఈ చ‌ట్టాన్ని ర‌ద్దు చేస్తూ.. ఏపీ అసెంబ్లీ ఏక‌గ్రీవ ఆమోదం తెలిపింది. దీంతో 2021-22 మ‌ధ్య అప్ప‌టి జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌చ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా ర‌ద్ద‌యిపోయిన‌ట్టు అయింది. ఎన్నిక‌ల‌కు మూడు వారాల ముందు.. అనూహ్యంగా ఈ అంశం తెర‌మీదకు వ‌చ్చింది. అప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప్ర‌చారం ఒక ఎత్తు అయితే. ఈ చ‌ట్టం వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చిన త‌ర్వాత‌.. జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారం మ‌రో ఎత్తు.

అప్ప‌టి వ‌ర‌కు గెలుపు ధీమాతో ఉన్న వైసీపీ నాయ‌కులను ఈ చ‌ట్టంపై ప్ర‌తిప‌క్షాలు చేసిన ప్ర‌చారం.. దిమ్మ‌తిరిగిపోయేలా చేసింది. “టైటిల్ చ‌ట్టం అమ‌లు చేస్తే.. మీ భూములు మీవి కావు. జ‌గ‌న్ వాటిని లాగేసుకుంటాడు. మీ ఆస్తులు తీసేసుకుంటాడు. మీ భూములు లాగేసుకుంటాడు” అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నుంచి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర‌కు ఊరూ వాడా ప్ర‌చారం చేశారు. దీనికి స‌రైన కౌంట‌ర్ ఇచ్చుకోలేక‌.. జ‌గ‌న్ తెల్ల మొహం వేశారు.

నిజానికి ఈ చ‌ట్టంపై స‌భ‌లో జ‌రిగిన చ‌ర్చ‌ల్లో అప్ప‌టి ఎమ్మెల్యే పయ్యావుల కేశ‌వ్ మంచిదేన‌ని చెప్పార‌ని జ‌గ‌న్ చెప్పే ప్ర‌య‌త్నం చేసినా.. ఫ‌లించ‌లేదు. మొత్తానికి బ‌ల‌మైన ఓటు బ్యాంకు బ‌దాబ‌ద‌లైపోయింది. కూట‌మికి ఎవ‌రూ ఊహించ‌ని విధంగా బ‌ల‌మైన మెజారిటీ తెచ్చిపెట్టింది. కాగా, తాను అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఈ చ‌ట్టాన్ని ర‌ద్దు చేస్తాన‌ని చంద్ర‌బాబు అప్ప‌ట్లోనే ప్ర‌క‌టించారు. ఆయ‌న ప్ర‌క‌టించినట్టుగానే రెండో సంత‌కాన్ని ఈ చ‌ట్టం ర‌ద్దు ఫైలుపైనే చేశారు. తాజాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ర‌ద్ద‌యి పోయింది.

తాజాగా ఏం జ‌రిగింది?

మంగ‌ళ‌వారం.. స‌భ ప్రారంభం కాగానే.. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును స‌భ‌లో పెట్టారు. ఈ సంద‌ర్భంగా స్పీక‌ర్ అయ్య‌న్న మాట్లాడుతూ.. ఈ చ‌ట్టాన్ని ర‌ద్దు చేసేందుకు అంగీక‌రించేవారు.. ‘అవును’ అనాల‌ని సూచించారు. దీంతో అంద‌రూ ఏక‌గ్రీవంగా ‘అవును’ అని చెప్పారు. దీంతో చ‌ట్టం ర‌ద్దు ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించిన‌ట్టు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. కాగా.. ఈ స‌మ‌యంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎవ‌రూ స‌భ‌లో క‌నిపించ‌లేదు.