కేంద్ర బ‌డ్జెట్‌: ఏపీపై వ‌రాలు ఇవే!

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన ఏడు మాసాల‌కు సంబంధించిన బ‌డ్జెట్‌లో ఏపీపై కొంత మేర‌కు వ‌రాల జ‌ల్లు కురిసింద‌నే చెప్పాలి. ఆశించిన దానిలో స‌గంలోపే ఉన్నా.. గ‌త ఐదేళ్ల బ‌డ్జ‌ట్‌తో పోల్చుకుం టే మాత్రం కొంత మేర‌కు ఆశాజ‌న‌కంగానే ఉంది. ఏపీకి కేటాయించిన బ‌డ్జెట్ ఇదీ..

+ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయ. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు.

+ ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం. పోలవరానికి కావాల్సిన నిధులు కేటాయింపు. అయితే.. ఎంత అనేది చెప్ప‌లేదు. ప్ర‌స్తుతం ఇప్ప‌టికిప్పుడు 1200 కోట్ల రూపాయ‌లు కేటాయించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం విన్న‌వించింది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

+ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, రైతులకు జీవనాడి పోలవరమ‌ని పేర్కొన్న నిర్మ‌లాసీతారామ‌న్‌.. భారత ఆహార భద్రతకు సైతం పోలవరం ఎంతో కీలకమైందని చెప్పారు(ఇన్నాళ్ల‌కు గుర్తించార‌ని ఆనంద ప‌డాలి). దీనిని పూర్తి చేసేందుకు సాయం చేస్తామ‌న్నారు.

+ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామ‌ని నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పారు. దీనిలో భాగంగా విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం అందిస్తామ‌న్నారు.

+ అదే విధంగా హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామ‌న్నారు. కానీ, ఎంత అనేది మాత్రం చెప్ప‌లేదు. గ‌త బ‌డ్జెట్‌ల‌తో పోల్చుకుంటే.. కొంత మేర‌కు న‌యం.

+ కొప్పర్తి-ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్‌, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు ఇస్తామ‌న్నారు.  ఇది కూడా ఎంత అనేది చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

+ ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామ‌న్నారు. వీటిలో ప్ర‌ధానంగా రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలు ఉన్నాయి. గ‌తంలోనూ రూ.350 కోట్ల చొప్పున ఇచ్చారు. లెక్కలు చెప్ప‌క‌పోవ‌డంతో నిధులు ఆపేశారు. మ‌రి వాటిని కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారా?  కొత్త‌గా ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

+ ఏపీలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి ఆర్థిక సాయం చేస్తామ‌న్నారు. అదేవిధంగా ఎంఎస్ ఎంఈ క్లస్టర్లు నూతన సిడ్‌బీ బ్యాంకు బ్రాంచ్‌లు ఏర్పాటు చేస్తామ‌న్నారు. రాష్ట్రంలో ఎగుమతులు, ఎగుమతుల సేవలకు ప్రత్యేక ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. అయితే.. ఏ రూపంలో సాయం చేస్తార‌నేది మాత్రం వెల్ల‌డించ‌లేదు.