వైసీపీకి భారీ షాక్‌.. కీల‌క నేత ఔట్‌!

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీకి అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ద‌క్క‌లేదు. ఇదొక షాక్ అయితే.. సోమ‌వారం మ‌రో భారీ షాక్ త‌గిలింది. గుంటూరు జిల్లాకు చెందిన ముఖ్య నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరి పార్టీకి రాజీనామా చేశారు. త‌న రాజీనామా ప‌త్రాన్ని ఆయ‌న పార్టీ అదినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌కు పంపించారు. 2019లో తొలిసారి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన మ‌ద్దాలిగిరి.. అప్ప‌ట్లో టీడీపీ త‌ర‌ఫున గుంటూరు వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. దీనికి ముందు రెండేళ్లు రాజ‌కీయాల్లో ఉన్న‌ప్ప‌టికీ.. పెద్ద‌గా ఆయ‌న పేరు ఎక్క‌డా వినిపించ‌లేదు.

వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన గిరికి.. కాంట్రాక్టులు.. ఇత‌ర‌త్రా వ్యాపారాలు కూడా ఉన్నాయి. అయితే.. 2019లో మ‌ద్దాలి గెలిచినా.. టీడీపీ మాత్రం ఓడిపోయింది. అనంత‌రం.. విజ‌య‌వాడ‌కు చెందిన మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాసరావు ప్రోత్సాహంతో మ‌ద్దాలి.. వైసీపీ బాట ప‌ట్టారు. వ్యాపారాల్లోనూ.. ఇత‌ర వ్య‌వ‌హారాల్లోనూ అధికార పార్టీ అండ‌గా ఉంటుంద‌ని భావించిన ఆయన వైసీపీ కండువా మార్చుకున్నారు. అయితే.. ఇత‌ర నాయ‌కుల మాదిరిగా .. చంద్ర‌బాబుపైకానీ.. టీడీపీపై కానీ..ఎక్క‌డా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో ఆయ‌న వివాదాస్ప‌ద నాయ‌కుడిగా పేరు తెచ్చుకోలేక పోయారు.

ఇదిలావుంటే.. ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్.. మ‌ద్దాలి గిరికి టికెట్ ఇవ్వ‌లేదు. ఆయ‌న గ్రాఫ్ బాగోలేదంటూ.. ప‌క్క‌న పెట్టారు. గుంటూరు వెస్ట్ సీటును అప్ప‌టి మంత్రి, చిల‌క‌లూరి పేట అప్ప‌టి ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీకి కేటాయించారు. పైగా.. ఆమెకు సాయం చేయాల‌ని పార్టీ మ‌ద్దాలిపై ఒత్తిడి తెచ్చింది. ఈ క్ర‌మంలో ఆయ‌న ఎన్నిక‌లు జ‌రిగిన స‌మ‌యంలో జిల్లాకు, రాష్ట్రానికి కూడా దూరంగా ఉన్నారు. తాజాగా వైసీపీ స‌భ్య‌త్వానికి, పార్టీకి కూడా గిరి రాజీనామా చేయ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు టీడీపీలో ఆహ్వానం అందిన‌ట్టు తెలుస్తోంది. పార్టీ ప‌రంగా వైశ్య సామాజిక వ‌ర్గానికి చంద్ర‌బాబు గ‌తంలోనూ పెద్ద‌పీట వేశారు. ఇప్పుడు కూడా అంతే పంథాలో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే గిరి టీడీపీ చెంత‌కు చేరుకునే అవ‌కాశం ఉందని తెలుస్తోంది.