చంద్ర‌బాబుపై బూతులు.. వైసీపీ నేత అరెస్టు

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబుపై బూతులు మాట్లాడుతూ.. అస‌భ్యంగా వ్య‌వ‌హ‌రించిన వైసీపీ అధికార ప్ర‌తినిధి నాగార్జున యాద‌వ్ అరెస్టు అయ్యారు. ఒక్క చంద్ర‌బాబునే కాదు.. ఆయ‌న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పైనా విమ‌ర్శ‌లు గుప్పించారు. మూడు పెళ్లిళ్లు అంటూ.. విమ‌ర్శించారు. అదేవిధంగా రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనితపైనా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయా అంశాల‌పై పోలీసుల‌కు టీడీపీ నాయ‌కులు ఫిర్యాదు చేశారు.

వీటిపై ఎప్పుడో కేసులు న‌మోదైనా.. నాగార్జున యాద‌వ్ త‌ప్పించుకుని తిరుగుతున్నారు. ఆయ‌న కోసం గాలిస్తున్న పోలీసుల‌కు తాజాగా బెంగ‌ళూరు నుంచి విజ‌య‌వాడ‌కు వ‌స్తున్న‌ట్టుగా స‌మాచారం అందుకుని.. గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యంలో కాపు కాచి అరెస్టు చేశారు. నేరుగా.. అదుపులోకి తీసుకుని స్టేష‌న్‌కు త‌ర‌లించారు. వైసీపీ అనుకూల మీడియాల్లో జ‌రిగే చ‌ర్చా కార్య‌క్ర‌మాల్లో పాల్గొనే నాగార్జున యాద‌వ్.. జ‌గ‌న్‌కు వీర విధేయుడు. ఆయ‌న‌పై ఈగ వాలినా త‌ట్టుకోలేనంత‌గా స్పందిస్తారు.

ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల‌కు ముందు త‌ర్వాత‌.. కూడా ప‌లు టీవీ చానెళ్ల‌లో ఆయ‌న మాట్లాడుతూ.. చంద్ర‌బాబుపై బూతులతో విరుచుకుప‌డ్డారు. ఆయ‌న అనారోగ్యాన్ని సైతం వ‌దిలి పెట్టుకుండా విమ‌ర్శ‌లు గుప్పిం చారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడు పెళ్లిళ్లు, కాపుల‌కు అన్యాయం చేశార‌ని.. ఇలా నోటికి ఎంత వ‌స్తే అంత మాట్లాడారు. మ‌రీ ముఖ్యంగా అనిత వ్య‌క్తిగ‌త జీవితంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అన‌లేని,.. విన‌లేని మాట‌లు మాట్లాడిన‌ట్టు పోలీసుల‌కు అందిన ఫిర్యాదులో టీడీపీ నేత‌లు పేర్కొన్నారు.

దీంతో నాగార్జున యాద‌వ్పై కుప్పం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తాజాగా అదుపులోకి తీసుకున్న నాగార్జున యాద‌వ్‌ను పోలీసులు వివిధ అంశాలపై విచారిస్తున్నారు. అయితే.. ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాది.. బెయిల్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ముంద‌స్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్ర‌యించారు. పోలీసులు మాత్రం వెంట‌నే ఆయ‌న‌ను కోర్టు ముందు పెట్టి జైలుకు పంపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.