దివ్యాంగుల-అంద‌గ‌త్తెలు… ఐఏఎస్ స్మితా వివాదం

Smita Sabharwal

ఐఏఎస్ – ఆఫీస‌ర్ అయ్యేందుకు ఉండాల్సిన అర్హ‌త‌లేంటి? దివ్యాంగులు ఈ ప‌రీక్ష‌ల‌కు అన‌ర్హులా..? వారిని ఎంపిక చేయ‌డం పాప‌మా? ఇదీ.. ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం. ఐఏఎస్‌గా ఎంపిక‌య్యే వారు.. కాళ్లు చేతులు స‌క్ర‌మంగా ఉండి.. ఎలాంటి వైక‌ల్యం లేనివారుగా ఉండాలంటూ.. తెలంగాణ‌కు చెందిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి స్మితా స‌బ‌ర్వాల్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒక్క తెలంగాణ‌లోనే కాదు.. దేశంలోని ప‌లురాష్ట్రాల్లోనూ దివ్యాంగులు మండిప‌డుతున్నారు.

భార‌త కీల‌క స‌ర్వీసుల్లో ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్ఎస్‌, ఐఎఫ్ఎస్‌లు కీల‌క‌మైన‌వి. వీటికి ఎంపిక చేసేవారిని యూపీఎస్సీ కీల‌క‌మైన నాలుగు వ‌డ‌పోత‌ల ద్వారా ఎంపిక చేస్తుంది. అయితే.. ఇటీవ‌ల పూజా ఖేద్క‌ర్ విష‌యంలో వెలువ‌డిన అవ‌క‌త‌వ‌క‌ల త‌ర్వాత‌.. ఈ ఉద్యోగాల‌పైనా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దేశంలో ఐఏఎస్ వ్య‌వ‌స్థ ఏర్ప‌డి 75 సంవ‌త్స‌రాలు అయింది. అయితే.. గ‌తంలో ఎప్పుడూలేని విధంగా ఇప్పుడు క‌మిష‌న్ విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది.

మ‌హారాష్ట్ర‌కు చెందిన పూజా ఖేద్క‌ర్‌.. దివ్యాంగుల కోటాలో ఐఏఎస్ కు ఎంపికయ్యారు. త‌న‌కు దృష్టి మాంద్యం ఉంద‌న్న‌ది ఆమె చెబుతున్న మాట‌. దీనికి సంబంధించిన స‌ర్టిఫికెట్ల‌ను కూడా ఆమె స‌మ‌ర్పించారు. ఈ కోటాలోనే ఆమె ఎంపిక‌య్యారు. త‌ర్వాత‌.. వివాద‌స్ప‌ద ఆదేశాలు, నిర్ణ‌యాల‌తో ఏకంగా ప‌క్క‌న పెట్టే ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే బీజేపీకి చెందిన కొంద‌రు నాయ‌కులు.. అస‌లు ఆమె స‌మ‌ర్పించిన దివ్యాంగ స‌ర్టిఫికెట్ల‌పైనా అనుమానం వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం వీటిపై కూడా విచార‌ణ జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా స్పందించిన స్మితా స‌బ‌ర్వాల్‌.. సివిల్స్‌లో అస‌లు దివ్యాంగుల కోటా ఎందుక‌ని ప్ర‌శ్నించారు. ఆరోగ్యంగా ఉన్న‌వారిని మాత్ర‌మే ఎంపిక చేయాల‌ని.. ప‌నిగంట‌లు ఎక్కువ‌గా ఉంటాయ‌ని.. ఎక్క‌డైనా ఏ స‌మ‌యంలో అయినా ప‌ర్య‌టించాల్సి ఉంటుంద‌ని.. కాబ‌ట్టి దివ్యాంగుల‌ను ఐఏఎస్‌, ఐపీఎస్, వంటి భార‌త స‌ర్వీసుల‌కు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరాద‌ని సెల‌విచ్చారు. దీనిపై నే ఇప్పుడు తీవ్ర దుమారం రేగింది. IAS కొట్టాలంటే అందగత్తెలు కావాల్సిన అవసరం లేదంటూ.. ప్ర‌ముఖ మెంటార్‌.. బాల ల‌త తీవ్రంగా ఆక్షేపించారు.

“దివ్యాంగుల గురించి మాట్లాడటానికి మీరెవరు? ఇద్దరం పరీక్ష రాద్దాం. ఎవరికెక్కువ మార్కులు వస్తాయో చూద్దామా? 24గంటల్లో మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే దివ్యాంగులు ఆందోళనకు దిగుతారు. స్మితకు సీఎస్ శాంతి కుమారి షోకాజ్ నోటీస్ ఇవ్వాలి” అని బాల ల‌త డిమాండ్ చేశారు. ఇదే అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేశారు. దివ్యాంగుల క‌మిష‌న్ సైతం దీనిపై ఆగ్ర‌హంగా ఉంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.