కమ్మవారి పై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

కమ్మవారు…అనగానే టీడీపీకి చెందిన వాళ్లు అనే ముద్ర ఏపీ, తెలంగాణలో ఉంది. పార్టీపరంగా ఆ సామాజిక వర్గానికి ఓ ముద్ర వేసి వారిని విమర్శించడం వైసీపీ నేతలకు అలవాటు. గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారని, వారికి చెందిన భూములు ఎక్కువగా ఉన్నాయని అమరావతి రాజధాని మొత్తానికి కుల ముద్ర వేశారు మాజీ సీఎం జగన్. ఆ క్రమంలోనే అమరావతిని అడవిగా మార్చేసిన జగన్ దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఓ సినిమాలో ఇంద్రకీలాద్రి పైన అమ్మవారు..కింద కమ్మవారు అంటూ పెట్టిన డైలాగ్ వైరల్ గా కూడా మారింది.

ఈ క్రమంలోనే తాజాగా కమ్మవారు అంటే అసలు అర్థం ఇది అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కమ్మ అంటే అమ్మలాంటి ఆలోచన అని రేవంత్ అన్నారు. కమ్మ వారు భూమిని నమ్ముకొని మట్టిలో నుంచి బంగారం తీసి పంటలు పండిస్తారని తెలిపారు.

ఎల్లపుడూ కష్టపడాలనే తత్వం కమ్మవారికి ఉంటుందని కితాబిచ్చారు. పది మందిని ఆదుకునే ఆలోచన కమ్మవారు చేస్తారని ప్రశంసించారు. అమరావతి నుంచి సిలికాన్ వ్యాలీ వరకు వారు విస్తరించారని, ఎన్నో కంపెనీలకు అధిపతులుగా ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ లో జరుగుతున్న కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మహా సభల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.