నిన్న నీట్‌-నేడు సివిల్స్‌.. మోడీ జ‌మానాలో ప‌రీక్ష‌ల‌కు ప‌రీక్ష‌లు!

“ఏ విద్యార్థి అయినా.. ఒక్క ఏడాది కోల్పోతే జీవితంలో అనేక సంవ‌త్స‌రాలు వెనుక‌బ‌డి పోతాడు. ఉద్యోగా ల్లో కావొచ్చు.. ప్ర‌మోష‌న్ల‌లో కావొచ్చు.. చివ‌ర‌కు రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లో కావొచ్చు.. కాబ‌ట్టి విద్యార్థి ద‌శ‌లో ప్ర‌తి ఏడూ.. కీల‌క‌మే“- గ‌త ఏడాది నవంబ‌రులో బిహార్‌లో వెలుగు చూసిన‌.. ప‌రీక్ష‌ల కుంభ‌కోణానికి సంబంధించిన కేసు విచార‌ణ  సంద‌ర్భంగా సుప్రీకోర్టు చేసిన వ్యాఖ్య‌లు ఇవి. కానీ.. పాల‌కుల‌కు మాత్రం ఈ వ్యాఖ్య‌లు వినిపించ‌డం లేదు. విద్యార్థుల స‌హనాన్ని ప‌రీక్షించ‌డ‌మే..ప‌రీక్ష‌లుగా నేడు ప‌రిస్థితి క‌ళ్ల‌కు క‌డుతోంది.

రాష్ట్రాలు స‌రే.. కేంద్రానికి ఏమైంది?  అనే ప్ర‌శ్న ఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు నీట్ ప‌రీక్ష అత‌లాకుత‌లం చేసింది. ఏకంగా పార్ల‌మెంటులో రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగంలో ఈ విష‌యాన్ని చేర్చే ప‌రిస్థితి వ‌చ్చింది. ఒక అవినీతి, అక్ర‌మం గురించి.. విచార‌ణ చేస్తున్నామ‌ని రాష్ట్ర‌ప‌తి చెప్ప‌డం.. అది కూడా బ‌ల‌మైన వైద్య విద్య వంటి అంశంపైప్ర‌స్తావించ‌డం 75 ఏళ్ల స్వ‌తంత్ర చ‌రిత్ర‌లో తొలిసారి అని మేధావులు చెప్పారు. దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల ఆరోగ్యానికి పూచీ ప‌డే వైద్య విద్య‌లోకి ప్ర‌వేశించే విద్యార్థుల‌ను నీట్ ద్వారా ఎంపిక చేస్తున్నారు.

ఈ ప‌రీక్ష‌లోనే అక్ర‌మాలు చోటు చేసుకున్నాయి. ప్రింటింగ్ ప్రెస్ ద‌గ్గ‌రే పేప‌ర్ బ‌య‌ట‌కు రావ‌డం.. కావాల‌ని అనుకున్న‌వారికి దీనిని అందించ‌డం.. జ‌రిగిపోయాయి. 24 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌తో  ముడి ప‌డిన వ్య‌వ‌హారం.. ఇంకా న‌లుగుతూనే ఉంది. దీనికి ఇప్ప‌టికీ.. ప్ర‌ధాని మోడీ  జ‌మానాలో ప‌రిష్కారం ల‌భించ‌లేదు. ఇక‌, ఇంత‌లోనే మ‌రో సంచ‌ల‌నం వెలుగు చూసింది. అదే.. ప్ర‌జ‌ల‌ను పాలించే.. క‌లెక్ట‌ర్ ఉద్యోగాలు. ఏటా సివిల్స్ నిర్వ‌హించే యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ వ్య‌వ‌హారం.. ఇప్పుడు వివాదాల‌కు కేంద్రంగా మారిపోయింది.

ప‌క్కా ప్ర‌ణాళిక‌తో.. మేధావుల‌ను అందించే యూపీఎస్సీ.. ఇప్పుడు దారి మ‌ళ్లిందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనికి కార‌ణం.. పూజా ఖేద్క‌ర్ వ్య‌వ‌హార‌మే. తీగ లాగితే.. డొంక క‌దిలిన‌ట్టు పూజ వ్య‌వ‌హారం.. యూపీఎస్సీ మెడ‌కు చుట్టుకుంది. ఓసీ కాండిడేట్ అయిన పూజ‌.. మ‌హారాష్ట్ర కోటాలో సివిల్స్ రాశారు. అయితే.. ఆమె కేవ‌లం 6 సార్లు మాత్ర‌మే రాయాల్సి ఉంటే.. యూపీఎస్సీ క‌న్నుగ‌ప్పి.. 12 సార్లు ప‌రీక్ష రాశారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా యూపీఎస్సీ ప్ర‌క‌టించింది. కేసు పెట్టింది.

అయితే.. ఇక్క‌డ పూజ నిందితురాలా కాదా.. అనే విష‌యం త‌ర్వాత తేలుతుంది. కానీ, ఇక్క‌డ యూపీఎ స్సీ వ్య‌వ‌హారం ఆందోళ‌న‌కు.. ఆక్రోశానికి కూడా దారి తీస్తోంది. సివిల్స్ రాసే అభ్య‌ర్థుల నుంచి ఆధార్ నెంబ‌ర్లు.. వేలి ముద్ర‌లు ఇలా.. అన్నీ ప‌క్కాగా తీసుకునే యూపీఎస్సీ.. పూజ విష‌యంలో ఎలా త‌డ‌బ‌డింది?  లేక‌.. ఈ విష‌యం వెలుగు చూశాక‌.. మాత్ర‌మే లోపాలు బ‌య‌ట‌ప‌డ్డాయా?  ఇదే నిజ‌మైతే.. ఇప్ప‌టి వ‌ర‌కు యూపీఎస్సీని ఎంత మంది క‌న్నుగ‌ప్పారు?  యూపీఎస్సీ ఎలా మోస పోయింది?  ఇవ‌న్నీ.. ఇప్పుడు తేలాల్సిన వ్య‌వ‌హారాలు.  

కాగా, ఈ నెల 22న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని యూపీఎస్సీ ప్ర‌ధాన కార్యాల‌యం ద‌గ్గ‌ర ధ‌ర్నాకు పిలుపునిచ్చింది. ఇది కూడా.. దేశ చ‌రిత్ర‌లో తొలిసారి. మొత్తంగా మోడీ జ‌మానాలో ఒక్కొక్క కీల‌క వ్య‌వ‌స్థ‌.. ఇలా భ్ర‌ష్టు ప‌ట్టిపోతుండ‌డంతో ఎవ‌రిని న‌మ్మాలో.. ఎవ‌రిని న‌మ్మ‌లేమో.. తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది.