అసెంబ్లీకి జగన్..హింట్ ఇదే

వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ నడిరోడ్డుపై దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ ఈ రోజు వినుకొండ వెళ్లారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పిన తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

45 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏపీలో శాంతిభద్రతలు లేవని సామాన్యుడికి కూడా అర్థమవుతోందని జగన్ అన్నారు. టీడీపీ వాళ్ళైతే చాలు ఎవరినైనా కొట్టొచ్చు, ఎవరి ఆస్తినైనా ధ్వంసం చేయొచ్చు అన్న రీతిలో పరిస్థితులున్నాయని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎవరిపైన హత్యా ప్రయత్నం చేసినా ఎవరిపై దాడి చేసినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని జగన్ ఆరోపించారు. పైగా బాధితులపైనే మర్డర్ కేసులు పెడుతున్నారని, ఈ నీచ సంస్కృతి రాష్ట్రంలో రాజ్యమేలుతుందని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 45 రోజుల్లో 35 రాజకీయ హత్యలు జరిగాయని, 300కు పైగా హత్యాయత్నాలు జరిగాయని చంద్రబాబు నాయుడు దీనికి ఏం సమాధానం చెబుతారని జగన్ ప్రశ్నించారు. టిడిపి నేతల వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్య చేసుకున్నారని, 56 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని జగన్ సంచలన ఆరోపణలు చేశారు.

ఇళ్లలోకి చొరబడి మరీ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, దుకాణాలు దహనం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తుల దహనం, దౌర్జన్యాలు, దాడులు జరిగాయని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దిగజారిందని జగన్ అన్నారు. ఏపీలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయి అనేందుకు రషీద్ హత్య ఉదాహరణ అని జగన్ చెప్పారు. ఇక్కడ రవిశంకర్ రెడ్డి ఎస్పీగా ఉండే వారని, ఎన్నికల వేళ పలుకుబడితో ఆయనను తప్పించేశారని జగన్ ఆరోపించారు.

ఆ తర్వాత బిందు మాధవ్ అనే అన్యాయస్తుడిని ఎస్పీగా తెచ్చుకున్నారని, చివరికి ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని ఆయనను తప్పించాల్సి వచ్చిందని జగన్ ఆరోపించారు. ఆ తర్వాత మలికా గర్గ్ అనే మంచి ఆఫీసర్ ను ఎస్పీగా ఎన్నికల సంఘం తీసుకొచ్చిందని, కానీ, చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆమెను బదిలీ చేసి శ్రీనివాస్ అనే ఎస్పీని తెచ్చుకున్నారని, ఆయన వచ్చిన రెండు మూడు రోజుల్లోనే ఈ హత్య జరిగిందని ఆరోపించారు. ఈ హత్యతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సానుభూతిపరులను ఇలాగే చంపుతామని సందేశం పంపినట్లు ఉందని జగన్ షాకింగ్ కామెంట్ చేశారు. ఈ హత్యలపై అసెంబ్లీలో గళం విప్పుతామని, గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఈ దారుణాలు ప్రస్తావిస్తామని అన్నారు.