పంచాయితీల‌కు ఊపిరి.. బాబు నిర్ణ‌యం ఏంటంటే!

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయితీలు.. కొన్నేళ్లుగా అలోల‌క్ష్మ‌ణా అంటూ.. అల‌మ‌టిస్తున్న విష‌యం తెలిసిందే. త‌మ‌కు కేంద్రం నుంచి వ‌స్తున్న నిధుల‌ను కూడా.. వైసీపీ స‌ర్కారు తీసుకుంటోంద‌ని.. త‌మ నిధులు త‌మ‌కు ఇవ్వాల‌ని పంచాయితీ స‌ర్పంచులు.. స‌భ్యులు.. కూడా పెద్ద ఎత్తున ఉద్య‌మించిన విష‌యం తెలిసిందే. అనేక మంది స‌ర్పంచులు సొంత నిధులు ఖ‌ర్చు చేసి మ‌రీ.. ప‌నులు చేయించారు. కానీ, స‌ర్కారు నుంచి నిధులు తిరిగి రాలేదు. దీంతో అప్పుల పాలై.. వాటిని తీర్చుకునే అవ‌కాశం లేక‌.. ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న‌వారు ఉన్నారు.

మ‌రికొంద‌రు భిక్షాటన చేసి.. గ్రామాల‌ను అభివృద్ధి చేసుకున్న వారు కూడా.. ఉన్నారు. వైసీపీ హ‌యాంలో 15వ ఆర్థిక సంఘం ప్ర‌తిపాదించిన నిధులను కేంద్రం ఇచ్చినా.. వాటిని పంచాయితీల‌కు ఇవ్వ‌కుండా తొక్కిపెట్టార‌న్న‌ది అప్ప‌ట్లో ప్ర‌ధానంగా తెర‌మీదికి వ‌చ్చిన‌ ప్ర‌శ్న‌. ఇది వైసీపీ స‌ర్కారు కూలిపోయేందుకు కూడా దారి తీసింది. అయితే.. చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు ముందు.. పంచాయితీల‌ను ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్ర‌కారం.. ఆయ‌న తాజాగా చ‌ర్య‌లు తీసుకున్నారు.

పంచాయితీల‌కు కేంద్రం ప్ర‌క‌టించిన 15వ ఆర్థిక సంఘం నిధుల‌ను రూ.250 కోట్ల‌ను రాష్ట్ర స‌ర్కారు కేటాయించింది. పంచాయితీల జ‌నాభా ప్రాతిపదిక‌న‌.. వీటిని పంపిణీ చేయ‌నున్నారు. దీంతో రాష్ట్రంలో తొలి విజ‌యం ద‌క్కించుకున్న‌ట్టుగా అయింద‌ని టీడీపీ మ‌ద్ద‌తుదారులుగా ఉన్న పంచాయితీ స‌ర్పంచులు చెబుతున్నారు. గ‌తంలో కూడా 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు అందాయి. కానీ, పంచాయ‌తీలు.. విద్యుత్ బ‌కాయిలు ఉన్నాయ‌ని పేర్కొంటూ ఆ నిధుల‌ను మిన‌హాయించుకున్న ప‌రిస్థితి ఏర్ప‌డింది.

దీంతో అప్ప‌ట్లో పంచాయితీల వ్య‌వ‌హారం.. రాజ‌కీయంగా దుమ్మురేపింది. అనేక మంది స‌ర్పంచులు రోడ్డె క్కి ధ‌ర్నాలు కూడా చేశారు. అయినా.. అప్ప‌టి జ‌గ‌న్ స‌ర్కారు స్పందించ‌లేదు. క‌నీసం సీఎం స్థానంలో ఉన్న జ‌గ‌న్ ప‌న్నెత్తు స‌మాధానం కూడా చెప్ప‌లేదు. దీంతో ఎన్నిక‌ల వేళ‌.. పంచాయితీలు వైసీపీని ఓడిం చి తీరాల‌న్న తీర్మానం చేసుకున్న విష‌యం తెలిసిందే. అయినా.. వైసీపీ అధినేత స్పందించ‌లేదు. ఈ నేప‌థ్యంలో తాము అధికారంలోకి వ‌స్తే.. పంచాయితీల నిధుల‌ను పంచాయ‌తీల‌కే ఇస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. తాజాగా ఇదే నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఇప్పుడు పంచాయితీల‌కు ఒకింత ఊపిరి వ‌చ్చిన‌ట్ట‌యింది.