కంగానా ర‌నౌత్ ఏం నీతులు చెప్పారు

మాట‌కు మాట పేల్చ‌డంలో త‌న‌కు తానే సాటి అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తారు.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని మండి నియోజ‌క‌వ‌ర్గం ఎంపీ.. నటి కంగానా ర‌నౌత్‌. తాజాగా జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఆమె.. బీజేపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆవెంట‌నే.. వివాద‌స్ప‌ద ప్ర‌క‌ట‌న గుప్పించారు. త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చే వారు.. ఎవ‌రైనా స‌రే.. ఆధార్ కార్డు చూపించాల‌ని, అడ్ర‌స్ నిరూపించుకునే ప‌త్రాలు తీసుకురావాలని వ్యాఖ్యానించి.. రాజ‌కీయాల్లో సెగ పుట్టించారు. ఈ వివాదం ఇంకా కొన‌సాగుతూనే ఉంది.

ఇంత‌లోనే మ‌రో కీల‌క వ్యాఖ్య చేశారు. పార్టీలు చీల‌డం.. ప్ర‌భుత్వాలు కూల‌డం రాజ‌కీయాల్లో మామూలే అని చెప్పిన కంగ‌నా.. వీటిని మానేసి రాజ‌కీయ నాయ‌కులు పానీపూరీ అమ్ముకోలేర‌ని ఘాటుగా స్పందిం చారు. దీంతో ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. అస‌లు కంగనా అంటే.. అటు బాలీవుడ్‌లోను.. హ‌డ‌లే. ఆమె న‌ట‌నే కాదు.. మాట‌లు కూడా.. చాలా ప‌దునుగా, ఘాటుగా ఉంటాయి. ఇప్పుడు బీజేపీ త‌ర‌ఫున ఆమె అధికార ప్ర‌తినిధి కాక‌పోయినా.. ఎక్క‌డ ఏం జ‌రిగినా వెంట‌నే రియాక్ట్ అవుతున్నారు.

తాజాగా మ‌హారాష్ట్ర‌కు చెందిన స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. ఉద్ద‌వ్‌కు కొంద‌రు నాయ‌కులు ద్రోహం చేశార‌ని అన్నారు. అంతేకాదు.. ఈ విష‌యంపై చాలా మంది ప్రజలు వేదనకు గురవుతున్నారని చెప్పారు. ఠాక్రేను న‌మ్మించి.. ఆయ‌న ప‌రివారంలోని వారే(సీఎం ఏక్ నాథ్ షిండే) ద్రోహం చేశార‌ని.. ఎప్ప‌టికైనా.. ఉద్ద‌వ్‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని చెప్పారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లోనే ప్ర‌జ‌లు ఆయ‌న ప‌క్షానే ఉన్న‌ట్టుగా తీర్పు ఇచ్చార‌ని(పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో) చెప్పారు.

ఈ వ్యాఖ్య‌లో ద్రోహం అన్న కామెంట్‌పై కంగ‌నా ర‌నౌత్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఒక ముఖ్య‌మంత్రిని ప‌ట్టుకుని ద్రోహి అంటూ.. అవిముక్తేశ్వ‌రానంద చేసిన వ్యాఖ్య‌లు మ‌హారాష్ట్ర ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీశాయ‌ని అన్నారు.

రాజకీయాల్లో పొత్తులు, పార్టీల విభజన, ప్ర‌భుత్వాలు కూలిపోవ‌డం.. కొత్త ప్ర‌భుత్వాలు రావ‌డం.. అనే సంస్కృతి ఎప్ప‌టి నుంచో ఉంద‌ని..ఇవి కామేన‌ని ర‌నౌత్ వ్యాఖ్యానించారు. ఇవి రాజ్యాంగ బ‌ద్ధ‌మేన‌ని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీలో కూడా.. గ‌తంలో అనేక సంద‌ర్భాల్లో పార్టీ చీలి.. ప్ర‌భుత్వాలు కూలిన సంద‌ర్భాలు ఉన్నాయ‌న్నారు. రాజకీయ నాయకులు రాజకీయాలు(ఇలాంటివి) చేయకుండా గోల్‌గప్పా(పానీపూరీ) అమ్ముకుంటారా?.. అని నిప్పులు చెరిగారు. ప్ర‌స్తుత ర‌నౌత్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌గా మారాయి. ర‌నౌత్ ఏం నీతులు చెప్పారు అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.