అయిననూ పోయి రావలె.. బాబుపై ష‌ర్మిల సెటైర్లు

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబును ఉద్దేశించి.. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల సెటైర్లు పేల్చారు. తాజాగా చంద్ర‌బాబు ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆమె స్పందిస్తూ.. “అయిన‌నూ.. పోయి రావెల హ‌స్తిన‌కు అన్న‌ట్లుంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన” అని వ్యాఖ్యానించారు. ఎన్డీయే కూటమిలో పెద్దన్న పాత్రగా, ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన చంద్ర‌బాబు.. ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నట్లు..? అని ప్ర‌శ్నించారు.

అంతేకాదు.. కూట‌మిలో 16 మంది ఎంపీల‌తో మ‌ద్ద‌తిస్తూ.. మోడీ ప్ర‌భుత్వం నిల‌బ‌డేందుకు కీల‌క రోల్ పోషిస్తున్న చంద్ర‌బాబు.. రాష్ట్ర ప్ర‌యోజనాల విష‌యంలో రాజీ ప‌డుతున్నార‌ని వ్యాఖ్యానించారు. ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుబట్టాల్సింది పోయి.. బీజేపీ పెద్దలకు `జీ హుజూర్‌` అంటూ సలాంలు ఎందుకు కొడుతున్నట్లు? అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు.

కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడి నెల రోజులు దాటినా.. ప్ర‌ధాని మోడీతో గానీ, ఇతర మంత్రులతో గానీ ఒక్క హామీ మీద ఎందుకు ప్రకటన చేయించలేక పోయారు?. గెలిచిన రోజు నుంచి నాలుగు సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటన అయినా వచ్చిందా? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదు అని కేంద్ర పెద్దలతో చెప్పించ గలిగారా? పోలవరం ప్రాజెక్ట్ కి నిధులపై స్పష్టత ఇచ్చారా? అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు.

అలాగే.. రాజధాని నిర్మాణం పై కేంద్రం ఇచ్చే సహాయం ఏంటో చెప్పగలిగారా? అని ష‌ర్మిల నిల‌దీశారు. ఓడ‌ దాటేదాకా ఓడ మ‌ల్ల‌న్న‌.. దాట‌క బోడి మ‌ల్ల‌న్న.. ఇదే బీజేపీ సిద్ధాంతం అంటూ.. ఎద్దేవా చేశారు. చంద్ర‌బాబు గారు ఇప్పటికైనా కళ్లు తెరవడం మంచిందని వ్యాఖ్యానించారు. మరోసారి రాష్ట్ర ప్రజల మనోభావాలతో బీజేపీ ఆటలు ఆడుకుంటోంద‌ని గుర్తిస్తే మంచిదన్నారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు సాధించ‌లేన‌ప్పుడు.. పొత్తులు పెట్టుకుని ప్ర‌యోజ‌నం ఏంట‌ని నిల‌దీశారు.