జీపీఎస్ – ఓపీఎస్ – దేనికి ఎస్ చెప్పినా.. బాబుకు తంటానే..!

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇప్పుడు పెద్ద సంక‌టం వచ్చి పడింది. ఒకవైపు జిపిఎస్‌కు సంబంధించిన జీవోను రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఉద్యోగులంతా సంబరాల్లో మునిగిపోయారు. పలుచోట్ల చంద్రబాబు చిత్రప‌టాలకు వారు పాలాభిషేకం కూడా చేశారు. అయితే ఇది తాత్కాలికం. దీనిని చూసి మురిసిపోయే అవ‌కాశం లేదు. ఎందుకంటే తాజాగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిపిఎస్ ను కొనసాగిస్తున్నామని కొందరు అధికారులు అత్యుత్సాహానికి పోయి ఇచ్చిన జీవో అది!

దీనిని ప్రస్తుతానికి రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకానీ వైసీపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన గ్యారెంటీ పింఛన్ సిస్ట‌మ్‌(జీపీఎస్‌)ను రద్దు చేస్తున్నట్టు ఎక్కడా ప్రకటన చేయలేదు. ఎందుకంటే ఉద్యోగులు కోరుతున్నది ఓపిఎస్ అంటే పాత పింఛను విధానం. దీనిని అమలు చేయడం అంటే ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. అయితే గతంలో కొన్ని రాష్ట్రాలు రాజస్థాన్ సహా హర్యానాలో దీనిని తిరిగి తీసుకొస్తున్నామని ప్రభుత్వాలు ప్రకటించాయి.

కానీ ఇది ఎన్నికలకు ముందు చేసిన హడావిడి తప్ప తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మళ్ళీ ఓపిఎస్ విధానాన్ని పక్కనపెట్టాయి. పాత పింఛన్ విధానంలో ఉద్యోగుల నుంచి రూపాయి తీసుకోకపోగా వారికి భారీ ఎత్తున లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంది. దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ పెరుగుతున్న నిరుద్యోగం, ఆర్థిక సమస్యలు, అప్పులు వంటివి పరిగణలోకి తీసుకుంటే ఉద్యోగుల రిటైర్మెంట్ తర్వాత ఆ స్థాయిలో ప్రయోజనాలు కల్పించటం రాష్ట్ర ప్రభుత్వాలకు తలనొప్పిగా మారింది.

గతంలో కేంద్ర ప్రభుత్వం కొంత సహాయకారిగా ఉండేది. కానీ ఈ విధానం నుంచి 2004లో కేంద్ర ప్రభుత్వం తప్పుకుంది. ఆ తర్వాత సిపిఎస్ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించారు. అంటే దీనిలో ఉద్యోగి జీతం నుంచి కొంత అమౌంట్ పింఛన్లకు వెళుతుంది. మిగిలిన దానిలో రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దీనిని అమలు చేయాలని కేంద్రం పదేపదే చెప్పడంతో అన్ని రాష్ట్రాలు ఓపిఎస్ నుంచి సిపిఎస్ కు మారాయి. ఈ విషయంపైనే 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు ఉద్యమించటం చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయము తీసుకోలేకపోవడం తెలిసిందే.

ఈ కారణంగా జగన్ తాను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ ను రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ హామీ ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చాక సిపిఎస్ రద్దు చేస్తే ఎంత ప్రమాదం ఉందో ఆయన తెలుసుకున్నారు. దీంతో మధ్యే మార్గంగా గ్యారంటీ పెన్షన్స్ సిస్ట‌మ్‌(జీపీఎస్‌)ని తీసుకువచ్చారు. అయితే, దీనికి కూడా ఉద్యోగులు ససేమిరా అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చలో విజయవాడ తర్వాత అనేక రూపాల్లో నిరసనలు వ్యక్తం చేశారు.

చివరికి ఎన్నికల్లో ఉద్యోగులంతా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అనేక పథకాల అమలు చేయాల్సి ఉంది. మరోవైపు ప్రాజెక్టుల నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధి వంటివి చంద్రబాబు ముందు కనిపిస్తున్న ప్రధాన సమస్యలు. వీటన్నిటినీ పక్కనపెట్టి ఉద్యోగుల మేలు లక్ష్యంగా ఆయన ఇప్పటికిప్పుడు సిపిఎస్ ని రద్దు చేయడం కానీ ఓ పి ఎస్ ను అమలు చేయడం కానీ తలకి ఎత్తు కోలేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.

అయితే ఉద్యోగులు కోరుతున్నట్టుగా సిపిఎస్ రద్దు చేసిన దాని స్థానంలో చంద్రబాబు మరో కొత్త పథకాన్ని తీసుకురావాల్సిన అవ‌స‌ర‌మైతే ఏర్పడింది. కాబట్టి ఇప్పటికిప్పుడు చంద్రబాబుకు సిపిఎస్ నుంచి కానీ ఇటు జేపీఎస్ నుంచి గాని ఉద్యోగుల విషయంలో సెగ తప్పే అవకాశం అయితే కనిపించడం లేదు. మరి ఏం చేస్తారో చూడాలి.