రుణమాఫీలో రేషన్ కార్డు పంచాయతీ..రేవంత్ క్లారిటీ

తెలంగాణలో రైతు రుణ మాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయిన సంగతి తెలిసిందే. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఉంటుందని, ఈ నెల 18 లోపు లక్ష రూపాయలలోపు రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎల్లుండి సాయంత్రానికల్లా రైతులు ఖాతాలలో డబ్బులు జమవుతాయని రేవంత్ అన్నారు. అయితే, రుణమాఫీకి రేషన్ కార్డు కచ్చితంగా ఉండాల్సిన పనిలేదని, రైతు పట్టాదారు పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని రేవంత్ క్లారిటీనిచ్చారు. కుటుంబాన్ని గుర్తించేందుకు రేషన్ కార్డు నిబంధన పెట్టామని వివరణనిచ్చారు.

రుణమాఫీ సంబరాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొంటారని రేవంత్ రెడ్డి చెప్పారు. పంద్రాగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీని అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని రేవంత్ చెప్పారు. ఎంత కష్టమైనా, భారమైనా ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని రేవంత్ తేల్చి చెప్పారు. అందరికీ అన్నం పెట్టే రైతన్నను అప్పులు నుంచి ఆశలు సాగు వైపు నడిపించే బృహత్తర సాహసమే రైతు రుణమాఫీ పథకమని రేవంత్ చెప్పారు. ఇది, కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైన ఘనత అని ఆయన అన్నారు. ఇది ‘రైతన్నకు మీ రేవంతన్న మాట’ అంటూ రేవంత్ రెడ్డి రుణమాఫీపై స్టేట్మెంట్ ఇచ్చారు.

దీంతోపాటు, ఆరోగ్యశ్రీ పథకానికి రేషన్ కార్డుకు లింకు పెట్టొద్దని రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందించేలా చర్యలు తీసుకోవాలని, అందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉండాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని, గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు అందేలా సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు పారితోషికం పెంచాలని రేవంత్ చెప్పారు.