ప‌సికందుల‌ పై పాశ‌వికాలు.. ఏపీకి ఏమైంది?

ఏపీలో ఏం జ‌రిగిందో ఏమో.. వ‌రుసగా జ‌రుగుతున్న అత్యంత దారుణ ఘ‌ట‌న‌లు స‌గ‌టు వ్య‌క్తుల‌ను నివ్వెర పోయేలా చేస్తున్నా యి. కేవ‌లం నాలుగంటే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో మూడు ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ఈ నాలుగు కూడా.. ప‌సికందుల‌పైనే కావ‌డం గ‌మ‌నార్హం. వీటిలో ఒక ఘ‌ట‌న ఐదు రోజుల చిన్నారిపై జ‌ర‌గ్గా.. మ‌రో రెండు ఘ‌ట‌న‌లు కూడా 8 ఏళ్ల ముక్కుప‌చ్చ‌లార‌ని చిన్నారుల‌పై చోటు చేసుకున్నాయి. ఆయా ఘ‌ట‌న‌లు రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఉలిక్కిప‌డేలా చేయ‌డం తోపాటు.. మ‌హిళ‌ల‌కే కాదు.. బాలిక‌ల‌కు కూడా ర‌క్ష‌ణ కొర‌వ‌డింద‌నే చ‌ర్చ‌కు దారితీశాయి.

ఎక్కెడ‌క్క‌డ‌?

వినేందుకు కూడా అస‌హ్యం:

విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం జీలుగువలసలో అత్యంత దారుణం జ‌రిగింది. వ‌రుస‌కు తాత‌య్యే 61 ఏళ్ల వ్య‌క్తి.. ఊయ‌ల‌లో ఆడుకుంటున్న ఐదు నెల‌ల ప‌సికందును అప‌హ‌రించి.. అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఇది వినేందుకు కూడా అస‌హ్యంగా ఉన్నా.. నిజం. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. స్పందించిన ప్ర‌భుత్వం స‌ద‌రు నిందితుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని ఆదేశించింది. చిన్నారి పేరిట రూ.5 ల‌క్ష‌లు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసింది.

ఆడిస్తానంటూ.. అఘాయిత్యం:

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం మూలకండ్రిగ గ్రామంలో ఆరేళ్ల బాలిక‌ను ఆడిస్తానంటూ.. పిలిచిన 65 ఏళ్ల తాత‌.. ఆమెపై దారుణానికి పాల్ప‌డ్డాడు. బాలిక తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన స‌మ‌యంలో ఇంట్లో ఆ బాలిక ఒంటరిగా ఉంది. ఈ స‌మ‌యంలో ఇంట్లోకి వెళ్లిన వృద్ధుడు.. ముందు చాక్లెట్ ఇచ్చి.. త‌ర్వాత ఆడుకుందామంటూ.. త‌న ఇంటికి తీసుకువెళ్లి.. దారుణానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేశారు.

యూట్యూబ్ చూసి అఘాయిత్యం:

నాలుగు రోజుల కింద‌ట‌ నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం మచ్చుమర్రి పరిధిలో ఎనిమిదేళ్ల బాలిక‌పై జ‌రిగిన అఘాయిత్యం రాష్ట్రం నివ్వెర పోయేలా చేసింది. బాలిక‌ను ఆడుకుందామ‌ని పిలిచిన ముగ్గురు బాలురు.. అత్యంత దారుణానికి ఒడిగ‌ట్టారు. అంతేకాదు.. ఆమెపై అత్యాచారం చేసి.. అనంత‌రం.. హ‌త్య చేశారు. బాలిక మృత దేహాన్ని ఓ బాలుడి తండ్రి.. కృష్ణాన‌దిలో ప‌డేయ‌డం మ‌రింత క‌ల‌క‌లం రేపింది. ఇక్క‌డ ఆలోచించాల్సిన విష‌యం ఏంటంటే.. యూట్యూబ్ చూసి బాలురు.. ఈ అఘాయిత్యానికి పాల్ప‌డ‌డం. మ‌రి పిల్ల‌ల‌కు సెల‌ఫోన్లు ఇచ్చే త‌ల్లిదండ్రులు ఈ ఘ‌ట‌న త‌ర్వాతైనా మేల్కొంటారో లేదో చూడాలి.

అమ్మ పిలుస్తోందంటూ…

గుంటూరు జిల్లా చేబ్రోలులో 13 ఏళ్ల బాలిక‌ను ఓ గ్యాస్ డెలివ‌రీ బాయ్‌.. ఆమె స్కూలుకు వెళ్లి.. మ‌రీ మీ అమ్మ పిలుస్తోందంటూ బ‌య‌ట‌కు పిలిచాడు. అనంత‌రం.. త‌న ఇంటికి తీసుకు వెళ్లి అత్యాచారానికి పాల్ప‌డ‌డ‌మే కాకుండా.. ఆమె గొంతు పిసికి చంపేశాడు. ఈ ఘ‌ట‌న 15వ తేదీ చోటు చేసుకుంది. గ్యాస్ డెలివరీ బాయ్‌గా చేస్తోన్న నాగరాజు ఈ అఘాయిత్యానికి పాల్ప‌డ‌డంతో అంద‌రూ నివ్వెర పోయారు. చ‌నువుగా ఉన్నాడ‌ని భావించిన గ్యాస్ డెలివ‌రీ బాయ్ ఇలా చేయ‌డంతో బాలిక కుటుంబం నిర్ఘాంత పోయింది. కాగా, నాగ‌రాజు ప‌రారీలో ఉన్నాడు.