ఇక‌, ‘ప్రైవేటు’ బాదుడు.. జ‌నాల జేబులకు చిల్లే!

మ‌రికొన్ని రోజుల్లో కేంద్ర ప్ర‌భుత్వం బ‌డ్జెట్ను ప్ర‌వేశ పెట్ట‌నుంది. అయితే.. దీనిలో ఎలాంటి బాదుళ్లు ఉంటాయి? ఎయే ప‌న్నులు వ‌డ్డిస్తార‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. అయితే.. ఇంత‌లోనే ప్ర‌జ‌ల‌కు చేరువైన కొన్ని ప్రైవేటు కంపెనీలు త‌మ‌దైన శైలిలో బాదుడు ప్రారంభించాయి. పోనీ.. వీటి సేవ‌ల‌ను వ‌దులుకుందామా? అంటే.. సాధ్య‌మ‌య్యే ప‌నికాదు. ఎందుకంటే.. ఆయా సంస్థ‌ల‌తో.. ఆయ‌న సేవ‌ల‌తో మ‌న జీవితాల‌ను మ‌న‌మే.. మ‌న‌కు తెలియ‌కుండా ముడివేసుకుపోయాం!!

దీంతో స‌ద‌రు ప్రైవేటు సంస్థ‌లు సొమ్ములు పిండుతున్నా.. మౌనంగా భ‌రించాల్సి వ‌స్తోంది. ఉదాహ‌రణ‌కు.. ఇటీవ‌లే ప్రైవేటు టెలిఫోన్ ఆప‌రేటర్లు.. జియో స‌హా.. ఎయిర్‌టెల్ సంస్థ‌కు భారీ ఎత్తున టారిఫ్ పెంచాయి. ఒక్కొక్క టారిఫ్ స్థాయిని బ‌ట్టి 60-450 వ‌ర‌కు పెరిగిపోయింది. అదే ప్లాన్‌.. అదే డేటా.. అదే లిమిట్‌.. అయినా ధ‌ర‌లు మాత్రం ఆకాశాన్నిఅంటాయి. దీనిని ప్ర‌శ్నించిన వారు కానీ, దీనిపై నిర‌స‌న వ్య‌క్తం చేసిన వారు కానీ.. ఎవ‌రూ క‌నిపించ‌లేదు.

ఇక‌, ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఫుడ్ డెలివ‌రీ సంస్థ‌లు కూడా.. ప్ర‌జ‌ల‌ను బాదేస్తున్నాయి. ద‌క్షిణాది రాష్ట్రాల్లో చిర‌ప‌రిచ‌య‌మైన‌.. జొమాటో, స్విగ్గీ సంస్థ‌లు.. త‌మ సేవ‌ల‌పై చార్జీల‌ను పెంచేశాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు రూ.4గా ఉన్న సేవ‌లు.. ఒక్కొక్క ఆర్డ‌ర్‌పై రూ.6కు పెంచాయి. కేవ‌లం ఒక్క‌రూపాయే క‌దా.. అని అనుకుంటే పొర‌పాటే.. ఒక ఇంట్లో నాలుగు ఆర్డ‌ర్లు ఇస్తే.. నాలిగిటికీ వేర్వేరు రూపాల్లో చార్జీలు వేస్తారు. సో.. మొన్న మొబైల్‌, నేడు ఫుడ్ డెలివ‌రీ సంస్థ‌లు బాదేశాయి.

ఇక‌, ఇప్పుడు ఓలా రెడీ అయింది. తాజాగా.. పెంపు ప్ర‌తిపాద‌న‌ల‌ను వెలువ‌రించేందుకు రెడీ అయింది. ప్ర‌యాణ చార్జీల‌ను పెంచ‌డంతోపాటు.. త‌మ న‌ష్టాల‌ను కూడా.. ప్ర‌జ‌ల‌పై వేసేందుకు రెడీ అయింది. దీంతో ఓలా ఆటో, కారు, ఇత‌ర వాహ‌నాల చార్జీల‌ను కిలో మీట‌రుకు రూ.5 చొప్పున పెంచేందుకు ఓలా రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. దీనిపై ఒక‌టి రెండు రోజుల్లోనే ప్ర‌క‌ట‌న రానుంది. అంటే.. కేంద్ర బ‌డ్జెట్ కంటే ముందే.. ప్రైవేటు సంస్థ‌లు బాదేస్తున్నాయి. మ‌రి కేంద్ర బ‌డ్జెట్‌లో ఎలాంటి బాదుళ్లు ఉంటాయో చూడాలి.