అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్, అమరావతి నిర్మాణం గురించి వచ్చిన కథనం దేశ రాజకీయ, పరిపాలన వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ది టైమ్స్ పత్రిక దక్షిణాసియా బ్యూరో చీఫ్ ముజిబ్ మషాల్, న్యూఢిల్లీ కేంద్రంగా భారతదేశ వార్తలను అందించే హరి కుమార్ ఈ వార్తా కథనాన్ని రాశారు. ఇందులో అమరావతి నిర్మాణం జరుగుతున్న తీరుతెన్నులను, దానికోసం సీఎం చంద్రబాబు పడుతున్న తపనను విశ్లేషించారు.
చంద్రబాబు అమరావతిని క్వాంటం రాజధానిగా తీర్చిదిద్దాలని చేస్తున్న ప్రయత్నాలు భారత యువతకు అరుదైన అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. కొత్త నగరాన్ని ఆర్ధిక చోదకశక్తిగా రూపొందించేందుకు కృషి చేస్తున్నట్లు కొనియాడారు. ప్రధాని మోదీ మద్దతుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని, హైదరాబాద్ ను ఒక టెక్ హాబ్ గా మార్చడంలో వున్న అనుభవాన్ని ఉపయోగించి అమరావతి రాజధానికి టెక్ హంగులద్దుతున్నారని వివరించారు.
ప్రఖ్యాత బ్రిటీష్ వాస్తు శిల్పి నార్మన్ పోస్టర్ రూపొందించిన డిజైన్ తో అమరావతి నిర్మాణం జరుగుతుందని, రోజుకు 25 వేల మందికి పైగా పనిచేస్తున్న ఈ నగరంలో ఐదు మైళ్ళ పొడవున ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు. 16 వేల మంది ఉద్యోగులు పనిచేసే విధంగా ఐదు ఎత్తయిన టవర్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. భారతదేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరాన్ని నిర్మించాలన్న చంద్రబాబు ఆశయం రూపుదిద్దుకుంటుందన్న ఈ కథనంతో అంతర్జాతీయ ప్రపంచం అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో ఎంత ఆసక్తి చూపుతుందో అర్ధం చేసుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిన కథనానికి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. అమరావతిని కొత్త తరం జీవన ప్రమాణాలకు బెంచ్ మార్క్ గా తీర్చిదిద్దడమే కూటమి లక్ష్యం అన్నారు. పచ్చదనం, సమర్ధత, సమ్మిళతత్త్వంతో కూడిన అమరావతి రాజధానిని నిర్మిస్తున్నట్లు వివరించారు. అమరావతి ప్రత్యేకతలను ప్రశంసిస్తూ న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని తన ఎక్స్ పోస్టులో జత చేశారు. న్యూయార్క్ కథనం టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహన్ని నింపింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates