వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం చర్చనీయాంశంగా మారింది. జగన్ పర్యటన నేపథ్యంలో ప్రధాన రహదారుల వెంట ఉన్న టీ దుకాణాలు, చిన్నపాటి టిఫిన్ సెంటర్లను కూడా వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు.
జగన్ ఆలూరు పర్యటనకు వస్తున్న నేపథ్యంలో సాయంత్రం 3 గంటల వరకు దుకాణాలు తెరవకూడదని వ్యాపారులు నిర్ణయించినట్లు సమాచారం. కొందరు ఉదయం 10 గంటలకే దుకాణాలు మూసివేసి, సామగ్రిని భద్రపరిచి తాళాలు వేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన కర్నూలు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు జగన్ ఆలూరు వచ్చారు.
జగన్ పర్యటన సందర్భంగా పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. కొందరు బైకులతో రోడ్లపై హంగామా చేయడంతో పాటు సైలెన్సర్లు తొలగించిన వాహనాలతో శబ్దాలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపణలు వచ్చాయి.
జగన్ ప్రధాన రహదారిపైకి చేరుకునే ముందే కార్యకర్తలు బైకులతో విన్యాసాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదని సమాచారం. బైకులతో విన్యాసాలకు కూడా అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
కేసులు తప్పవు
ఆలూరులో జరిగిన పరిణామాలపై పోలీసులు స్పందించారు. ఎలాంటి ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని, అయినప్పటికీ కొందరు కార్యకర్తలు బైకులతో రోడ్లపైకి వచ్చారని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా వారిని గుర్తించి, వాహనాలను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. అయినప్పటికీ కార్యకర్తలు నిబంధనలు పట్టించుకోకుండా వ్యవహరించడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates