త్వ‌ర‌లోనే ‘ఛానెల్’ పెడ‌తా: సాయిరెడ్డి

వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు.. ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వరలోనే తాను మీడియా ఛానెల్ పెట్ట‌నున్న‌ట్టు తెలిపారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు. అంతేకాదు.. అర్థం ప‌ర్థం లేకుండా చేసిన ప్ర‌చారం.. త‌న‌ను హ‌ర్ట్ అయ్యేలా చేసింద‌న్నారు. మీడియాకు ఎందుకంత తొంద‌ర‌? అని వ్యాఖ్యానించారు. దేవ‌దాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌నర్‌.. శాంతి భ‌ర్త రాసిన లేఖ ఆధారంగా ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని ఆయ‌న ఖండించారు.

“చ‌దువులేని వాళ్లే..మీడియా ఛానెళ్లు పెడుతున్నారు. ఎంతో చ‌దువుకున్న నేను మీడియా ఛానెల్ పెట్ట‌లేనా? ఖ‌చ్చితంగా పెడ‌తాను.” అని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కొన్ని మీడియా ఛానెళ్లు.. శాంతి భ‌ర్త రాసిన లేఖ‌ను ఆధారంగా చేసుకుని.. త‌న‌పై వికృత ప్ర‌చారం చేశాయ‌ని.. వాటిపై చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని ఆయ‌న చెప్పారు. అంతేకాదు.. ప్ర‌తి విష‌యాన్ని తాను న్యాయ స్థానంలో తేల్చుకుంటాన‌న్నారు.

“ప్ర‌తిప‌క్షంలో ఉన్నారు.. ఏం చేస్తారులే అని అనుకుంటున్నారా? ప్ర‌తిప‌క్షంలో ఉన్నా.. న్యాయం, చట్టం వంటివి ఎప్ప‌టికీ ఉంటాయి. కాబ‌ట్టి.. చ‌ట్ట ప‌రిధిలోనే చ‌ర్య‌లు తీసుకుంటా” అని సాయిరెడ్డి హెచ్చరించారు. కేవ‌లం శాంతి భ‌ర్త రాసిన లేఖ‌ను ఆధారంగా చేసుకుని.. త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేశార‌ని మండిప‌డ్డారు. దీనివెనుక నిజానిజాలు తెలుసుకునే అవ‌స‌రం లేకుండా పోయిందా? అని నిల‌దీశారు. “బుద్ధిలేని ఎండోమెంట్ కమిషనర్ కు ఎంక్వయిరీ చేయమని లెటర్ ఇస్తే.. దాన్ని మీడియాకు ఎలా ఇస్తారు. ఇది కుట్రలో భాగంగానే జరిగింది. పార్లమెంట్లో వంశీకృష్ణపై ప్రివిలేజ్ మోషన్ వేస్తా” అని సాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

“వచ్చిన నెలలోనే ప్రభుత్వం అరాచకాలు సృష్టించి భయభ్రాంతులకు గురిచేస్తోంది. మీ తాటాకు చప్పట్లు భయపడను. మ‌ధ్యంతర ఎన్నికలు వచ్చినా ఐదు సంవత్సరాల తర్వాత అయినా వైసీపీ అధికారంలోకి వస్తుంది. నా ప్రతిష్టలు దిగజారిచే వారిని వదిలిపెట్టను. నామీద ట్రోల్ చేసిన యూట్యూబ్ ఛానల్, టీవీ ఛానల్ పై హ్యూమన్ రైట్స్ . ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్, ఎస్టీ కమిషన్, ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తాం” అని సాయిరెడ్డి వివ‌రించారు.