ఉచితం అనుచిత‌మైతే.. వీటి సంగ‌తేంటి.. కేటీఆర్‌?

ఉచిత ప‌థ‌కాలు అనుచిత‌మంటూ.. తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఉచితాల రూపంలో ఇచ్చేవాటి వెనుక పెను ఆర్థిక భారం ఉంటుంది అని ట్విట్ట‌ర్‌లో కేటీఆర్ పోస్టు చేశారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌కు ఉచిత ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణాన్ని అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. అధికారంలోకి వ‌చ్చిన కొన్నాళ్ల‌కే రేవంత్ ఈ ప‌థ‌కాన్ని మ‌హిళ‌ల‌కు చేరువ చేశారు.

అయితే.. పొరుగున ఉన్న క‌ర్ణాట‌క‌లో అమ‌ల‌వుతున్న ఈ ఉచిత బ‌స్సు ప‌థ‌కం కింద ఏడాదికి 295 కోట్ల రూపాయ‌ల న‌ష్టం వ‌స్తోంద‌ని.. అక్క‌డి అధికారులు విన్న‌వించారు. త‌క్ష‌ణ‌మే సాధార‌ణ బ‌స్సు చార్జీల‌ను పెంచాల‌ని కూడా ప్ర‌తిపాదించారు. దీనికి సంబంధించిన వ్య‌వ‌హారాన్ని అక్క‌డి సిద్ద‌రామ‌య్య స‌ర్కారు కూడా సీరియ‌స్‌గానే తీసుకుంది. గ‌త ఏడాది మే నెల‌లో అధికారం చేప‌ట్టిన సిద్ద‌రామ‌య్య‌.. సీఎంగా ప్ర మాణం చేసిన వెంట‌నే ఉచిత బ‌స్సు ప‌థ‌కాన్ని అమ‌లు చేశారు.

కాగా.. దీనిపై ఏడాది త‌ర్వాత‌.. లాభ‌న‌ష్టాలు భేరీజు వేసుకుంటే.. క‌ర్ణాట‌క ఆర్టీసీ న‌ష్టాల్లో కూరుకుపోయింద నేది అక్క‌డి అధికారులు ఇచ్చిన నివేదిక‌ల సారాంశం. క‌ట్ చేస్తే.. ఇప్పుడు వాటిని ఉటంకిస్తూ.. కేటీఆర్.. రేవంత్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఉచిత బ‌స్సు ప్ర‌యాణంతో రాష్ట్రంలో మ‌రిన్ని ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే సాధార‌ణ ప్ర‌యాణికుల‌కు ఆర్టీసీ బ‌స్సు చార్జీల వ‌డ్డ‌న త‌ప్ప‌ద‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

అయితే.. కేటీఆర్ చేసిన విమ‌ర్శ‌ల‌పై.. రాజ‌కీయ వ‌ర్గాలు స్పందిస్తూ.. గ‌తంలో మీ ప్ర‌భుత్వం మాత్రం ఉచిత ప‌థ‌కాలు అమ‌లు చేయ‌లేదా? అని ప్ర‌శ్నించారు. ద‌ళిత బంధు కింద‌.. రూ.10 ల‌క్ష‌లు, రైతు బంధు ప‌థ‌కాల‌ను అమ‌లు చేసిన‌ప్పుడు.. ఖ‌జానాకు న‌ష్టం రాలేదా? ఉచితాలు అన్నాక‌..అన్ని ప్ర‌భుత్వాలు ఇచ్చేవేన‌ని… ఇప్పుడు కొత్త‌గా అమ‌లు చేస్తున్న‌వి కాద‌ని.. వ్యాఖ్యానిస్తున్నారు. ఉచిత ప‌థ‌కాల‌ను ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌స్తావించిన పార్టీగా.. హామీలు గుప్పించిన పార్టీగా.. బీఆర్ ఎస్‌.. వ్య‌వ‌హారాన్ని కేటీఆర్ మ‌రిచిపోరాద‌ని సూచిస్తున్నారు.