ఆ ఒక్క ఛాన్స్ ఎవరికిస్తారో బాబు ?!

ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయి ప్రభుత్వం కొలువుదీరినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖాళీగా వదిలేసిన ఒక స్థానం ఎవరికి దక్కుతుందా అని వంద మంది ఆశావాహులను ఊరిస్తున్నది. ఏపీ క్యాబినెట్ లో మంత్రులుగా 25 మందికి అవకాశం ఉంది. అయితే చంద్రబాబు తన క్యాబినెట్ లో ఇప్పటి వరకు 24 మందిని తీసుకున్నారు. దీంతో ఒక మంత్రి పదవి ఖాళీగా మిగిలిపోయింది.

చంద్రబాబు దీనిని వ్యూహాత్మకంగా వదిలేశారా ? లేక ఆయన మనసులో ఎవరైనా ఉన్నారా ? దానిని భర్తీ చేస్తారా ? లేక అలాగే వదిలేస్తారా ? అన్నది అర్ధంకాక ఆశావాహులు తలలు పట్టుకుంటున్నారు. ఈ సారి మంత్రి వర్గంలో చంద్రబాబు యువతకు ప్రాధాన్యం ఇచ్చారు. తొలిసారి ఎన్నికైన వారికి అమాత్యులుగా అందలం ఎక్కించారు. కాకలు తీరిన సీనియర్ టీడీపీ నేతలను మంత్రి పదవులు ఇవ్వకుండా పక్కన పెట్టారు. దీంతో మిగిలిన స్థానంపై అందరూ ఆశలు పెట్టుకున్నారు.

టీడీపీలో సీనియర్ నేతలు, మాజీ మంత్రులు అయిన పరిటాల సునీత, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, కళింగ సామాజిక వర్గం నుండి కూన రవికుమార్, టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయిన రఘురామ కృష్ణంరాజు, చింతమనేని ప్రభాకర్‌, దేవినేని ఉమ, ఆలపాటి రాజా, దూళిపాల నరేంద్ర, జనసేన నుండి గెలిచిన మండలి బుద్దప్రసాద్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ నుండి గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయప్రకాష్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి ఇలా మిగిలిపోయిన మంత్రి పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య చాంతాడంత పేరుకుపోయింది.

టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా గెలిచిన ప్రతి ఏడు మందిలో ఒకరికి మంత్రి పదవి చొప్పున జనసేనకు 3, బీజేపీకి 1, మిగిలినవి టీడీపీ పార్టీకి ఇచ్చి మంత్రి పదవులను భర్తీ చేశారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిలో ఎవరి పర్ ఫార్మెన్స్ అయినా బాగోలేకుంటే వారిని తొలగించి దాంతో ఇది భర్తీ చేస్తారా ? అన్న టెన్షన్ కూడా మంత్రులను అటెన్షన్ లో ఉంచుతుందని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బాబు ఆలోచన ఏంటా అని ఆశావాహులు మదనపడుతున్నారు.