ఓట‌మి త‌ర్వాత‌.. ష‌ర్మిల ఫైరా.. ఫ్ల‌వ‌రా..?

ఎన్నికల ఫలితాలు తర్వాత ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ షర్మిల పనితీరు ఎలా ఉంది? ఎన్నికలకు ముందు ప్రజా సమస్యలను పట్టించుకుంటానని, ప్రజల్లోనే ఉంటాన‌ని, ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు. అంతేకాదు.. అందుకే ఏపీ గడ్డపై అడుగు పెట్టానని ఆమె పలు రకాల వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల సమయంలో సమస్యలు పరిష్కరించేందుకు తాను ముందు ఉంటాన‌ని ప్రతిపక్షం కన్నా ఎక్కువగా ప్రజల సమస్యలపై స్పందిస్తానని కూడా ఎన్నికలవేళ ఆమె చెప్పుకొచ్చారు.

అయితే ఎన్నికలు జరిగిపోయాయి. ఫలితాలు వచ్చేసాయి. అనుకున్న ఆశలైతే తీరలేదు. మరి నెల రోజులు గడిచిపోయింది. షర్మిల ఈ నెల రోజులు కాలంలో ఏం చేశారు? ఏం సాధించారు? అనేది చూస్తే.. కేవ‌లం రెండు విషయాల్లో ఆమె స్పందించిన పరిస్థితి కనిపించింది.

ఈ నెల రోజులు కాలంలో ఒకటి వైయస్ విగ్రహాల ధ్వంసం విషయంలో ఒకసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేయటం ఏంటి? రాష్ట్రంలో ప్రజా నాయకుడి విగ్రహాలను కూల్చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ఇది ప్రభుత్వానికి తెలిసి జరిగిందా? క్షేత్రస్థాయిలో అధికార పార్టీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారా అనేది తెలియకపోయినా షర్మిల చేసిన వ్యాఖ్యలు కొంత ప్రభుత్వంలో కలకలం రేపాయి. ఆ వెంటనే చర్యలు తీసుకున్నారు. రెండోది పశ్చిమగోదావరి జిల్లాలో ఒక విద్యార్థినికి జరిగిన అన్యాయంపై షర్మిల గళం వినిపించారు.

తన పదో తరగతి మార్కుల లిస్ట్ కోసం ఆ విద్యార్థిని పాఠశాలకు వెళ్లడం, అక్కడ స్కూల్ తాళాలు వేసి ఉండడం, ఆ అమ్మాయి వెను తిరిగి వస్తుండడంతో సహచర విద్యార్థులు కొందరు అమ్మాయిని మళ్ళీ వెనక్కి పిలిచి సామూహికంగా లైంగిక దాడి చేయడం వంటివి కలకలం రేపాయి.

ఈ విష‌యంపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. అయితే ఈ విషయంపై షర్మిల స్పందించిన తర్వాత, స్పందించడానికి ముందు అన్నట్టుగా వ్యవహారం నడిచింది. షర్మిల స్పందించక ముందు దాదాపు ఈ విషయం పెద్దగా ఎవరికి తెలియలేదు. కానీ షర్మిల స్పందించిన తర్వాత మాత్రం ఈ విషయం మీద బాధితురాలికి ప్రభుత్వం నుంచి న్యాయం జ‌రిగింది. ప్రభుత్వం న్యాయం చేసిందని చెప్పాలి. మొత్తంగా చూస్తే ఈ రెండు ఘటనలు మినహా షర్మిల దేని మీదా కూడా స్పందించలేదు.

ఇక‌, వైయస్ జయంతి సందర్భంగా మాత్రం మంగళగిరిలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేయటం గ‌మ‌నార్హం. వైఎస్‌ వారసురాలు నేనే అని చెప్పుకోవడానికి మాత్రం ఈ నెల రోజుల కాలంలో ఆమె పరిమితం అయ్యారని చెప్పాలి. ఇంతకుమించి ప్రజాసేవపరంగా ప్రతిపక్షం పరంగా ఆమె చేయడానికి ముందుకు రాలేదా? లేకపోతే చేసే అవకాశం రాలేదా? అనేది తెలియాలి. మొత్తంగా నెల రోజుల్లో షర్మిల రెండు ట్వీట్లు, ఒక కార్యక్రమానికి మాత్రమే పరిమితం అయ్యారు.