జనసేన మంత్రుల్లో ఈయన సూపర్ ఫాస్ట్..!

“జనసేన మంత్రుల్లో ఈయన సూపర్ ఫాస్ట్!” అనే పేరు తెచ్చుకున్నారు నాదెండ్ల మనోహర్. జనసేన తరపున గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల్లో మొత్తం ముగ్గురు ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరిలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయం పక్కనపెడితే మిగిలిన ఇద్దరు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందులు దుర్గేష్‌ ఉన్నారు.

వీరిలో నాదెండ్ల మనోహర్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు మేలు చేస్తున్నాయని సంకేతాలు ఇస్తున్నాయి. వచ్చీ రావడంతోనే ఇంకా మంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందే గుంటూరులో జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమాలపై కొరడా ఝుళిపించారు.

రాత్రికి రాత్రి గోదాముల‌పై దాడులు చేయటం. అక్రమ నిల్వ‌ల‌ను స్వాధీనం చేసుకునే లాగా వ్యవహరించడం వంటివి మనోహర్ పనితీరుకు మార్కులు పడేలా చేశాయి. అనంతరం కాకినాడలో జరుగుతున్న బియ్యం అక్రమ రవాణా పై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు.

వైసిపి నాయకులు వీటిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని ఎన్నికలకు ముందు నుంచి ఆరోపించిన నాదెండ్ల మనోహర్… అధికారంలోకి రాగానే బియ్యం అక్రమ రవాణాపై చర్యలు తీసుకునేలా వ్యవహరించారు. కీలక స్థానాల్లో ఉన్న‌ అధికారులను ట్రాన్స్‌ఫ‌ర్ చేయడంతో పాటు నేరుగా రంగంలోకి దిగి కాకినాడలోనే నాలుగు రోజులు పాటు మకాం వేశారు.

బియ్యం అక్రమ నిలవలు, అక్రమ రవాణాపై దాడులు చేయించడం, కేసులు నమోదు చేసేలా వ్యవహరించడం నాదెండ్ల మనోహర్ పనితీరుకు అద్దం పడుతున్నాయి. ఇక పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించే విషయంలో నాదెండ్ల మనోహర్ కీలకంగానే వ్యవహరించారు.

ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో బియ్యం, కందిపప్పు, నూనెలు, ఉల్లిపాయలు వంటివి ధరలు మండిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇవన్నీ పౌరసరఫరాల శాఖ పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని కూడా నాదెండ్ల మనోహర్ సీరియస్ గా తీసుకున్నారు. ఎలాంటి ఫిర్యాదులు అందకపోయినా తానే స్వయంగా రంగంలోకి దిగి ఆయా నిత్యవసర సరుకులు రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకు అందేలా ఆయన తీసుకున్న చర్యలు ఫలితాన్ని ఇస్తున్నాయి.

గడిచిన రెండు రోజుల నుంచి అన్ని రైతు బజార్లలో రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసర సరుకులు బహిరంగ మార్కెట్ కంటే కొంచెం తక్కువగానే అందుబాటులోకి వచ్చేలా ఆయన చర్యలు తీసుకున్నారు. అలాగే నాణ్యత లోపాలను గుర్తించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఆయన రంగంలోకి దింపారు.

తూకాలు, కొలతల పరిధిలో జరుగుతున్న మోసాలను కూడా అరికట్టేందుకు నాదెండ్ల మనోహర్ కృషి చేస్తున్నారు. ఈ నెలరోజుల కాలంలో తొలి 15 రోజులు బియ్యం అక్రమ రవాణాలు ముఖ్యంగా పిడిఎస్ బియ్యం పై ఆయన చూపించిన శ్రద్ధ మంచి ఫలితాన్ని ఇవ్వగా.. గత 15 రోజులుగా నిత్యవసర సరుకులు ధరలు పెంపు పై ఆయన దృష్టి పెట్టారు.

ఈ నెలరోజుల కాలంలో నాదెండ్ల మనోహర్ పనితీరుకు మంచి మార్కులు పడ్డాయని చెప్పాలి. ఇక జనసేన నుంచి మరో పదవిని అందుకున్న కందుల దుర్గేష్ తన శాఖలో పనితీరును మెరుగుపరచేలా చర్యలు తీసుకున్నారు. సినిమాటోగ్రఫీ శాఖ ఆయన పరిధిలోనే ఉన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీని ఏపీకి రప్పించడం, విశాఖపట్నంని టాలీవుడ్ కి కేంద్రంగా చేసే అంశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. మొత్తంగా చూస్తే జనసేనలో మంత్రి పదవులు దక్కించుకున్న ఇద్దరు బాగానే పనిచేస్తున్నారని చెప్పొచ్చు. ముందు ముందు వారి పనితీరు మరింత మెరుగుపడుతుందని పార్టీ నాయకులు సైతం ఆశిస్తున్నారు.