ప‌వ‌న్‌.. చెత్త నుంచి సొమ్ము తెస్తున్నారు!

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ త‌న హ‌యాంలో చెత్త‌పై ప‌న్నులు వేసి సొమ్ములు చేసుకున్నారు. కానీ, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న ప‌వ‌న్‌.. అదే చెత్త‌ను వినియోగించి వేల కోట్ల రూపాయ‌ల సొమ్ములు సంపాయించుకునే మార్గం దిశ‌గా అడుగులు వేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యంపై ప్రధానంగా దృష్టి సారించామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాడేపల్లిలో ఈ రోజు ఆయన అధికారులతో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఇళ్ళ నుంచి సేకరించే చెత్త నుంచి ఆదాయం పొందవచ్చన్నారు. ఏడాదికి 2 వేల 643 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందన్నారు.

రాష్ట్రంలో పంచాయతీల్లో నిధులు లేవని.. గత ప్రభుత్వం పంచాయతీలను, నిధులను దారి మ‌ళ్లించింద‌ని వివ‌రించారు. గ్రామీణ ప్రాంతాల్లో చెత్త నిర్వహణ విషయంలో బాధ్యత తీసుకుంటానని చెప్పారు. రోజుకు రెండుసార్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించి, ప్రాసెసింగ్ సెంటర్ కు పంపిస్తామ‌న్నారు.తద్వారా వ‌చ్చే సొమ్మును గ్రామీణ ప్రాంతాల‌కే ఖ‌ర్చు చేస్తామ‌న్నారు. ఇక‌, న‌దుల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. గోవుల‌ను ప‌రిరక్షించేందుకు, గో సంత‌తి పెంచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తామ‌న్నారు. కాలువలు, న‌దులు డంపింగ్‌ యార్డుల్లా మారిపోయాయ‌ని చెప్పారు. వీటిని ప్ర‌క్షాళ‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మ‌రో సంచ‌లన ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణం పై ప్రత్యేక ఫోకస్ పెట్టిన ఆయ‌న ఓ చెట్టు గురించి మాట్లాడుతూ.. వాటిని త‌క్ష‌ణ‌మే న‌రికేయాల‌ని సూచించారు. అవి చాలా డేంజర్ అని వెంటనే తొలగించాల‌ని అధికారులకు సూచించారు. ‘కోనో కార్పస్ చెట్లను గతంలో తన ఫాంహౌస్‌లో పెంచానని పవన్ తెలిపారు. అయితే వాటితో ప్రమాదమ‌ని తెలిసి తొలగించిన‌ట్టు వెల్ల‌డించారు. కాకినాడలో మొత్తం 4,602 కానో కాన్ఫరస్ చెట్లు ఉన్నట్లు గుర్తించామ‌న్నారు. ఈ చెట్లను దశల వారీగా తొలగించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు.

ఏడాకుల చెట్టుగా పిలుచుకునే ఈ కోనో కార్పస్ ప్రజల ఆరోగ్యానికి మంచిది కాద‌ని పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడంతో అధికారులు వాటిని తొలగించే పనిలో పడ్డారు. దక్షిణ అమెరికాకు చెందిన కోనో కార్పస్ జాతి మొక్కల్ని సుందరీకరణ కోసం వాడుతున్నారు. వాటి వలన భూగర్భజలాలు తగ్గపోతాయని, ప్రజల ఆరోగ్యాలకు కూడా ప్రమాదమని ఓ అధ్యయనంలో తేలింది. దీంతో ప‌వ‌న్ వాటిని తొల‌గించాల‌ని ఆదేశించారు.