తిరుమలలో ఇదేం పని?

Tirumala

దేశవ్యాప్తంగా హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఆలయం.. తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిది. ఆలయ పవిత్రతను కాపాడడానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తుంటుంది టీటీడీ. ఇందులో భాగంగానే ఆలయ ప్రాంగణంలో ఎక్కడా మొబైల్ ఫోన్లను అనుమతించరు. క్యూ కాంప్లెక్స్‌లలోకి కూడా సెల్ ఫోన్లతో ప్రవేశించడానికి అవకాశం ఉండదు.

అలాంటి చోట్ల కొందరు తమిళ యువకులు వీడియోలు తీసి రీల్స్‌లో పోస్ట్ చేయడం కలకలం రేపుతోంది. తమిళనాడుకు చెందిన యువకుల బృందం.. తాజాగా భద్రత సిబ్బంది కళ్లు గప్పి లోనికి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లింది. అంతే కాక నారాయణగిరి ఉద్యాన క్యూ కాంప్లెక్స్ లోపల ప్రాంక్ వీడియోలు కూడా చేసింది. క్యూ కాంప్లెక్స్ గేట్లు తెరిచేస్తున్నట్లుగా జనాలకు భ్రమలు కల్పించి వారిని ఫూల్స్‌ను చేసే ప్రయత్నం చేసింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ ప్రాంక్ వీడియోల వ్యవహారం టీటీడీ దృష్టికి వెళ్లింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన టీటీడీ.. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. బాధ్యులపై చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఐతే సెల్ ఫోన్ లోపలికి తీసుకెళ్తే దారి మధ్యలోనే సెన్సర్లు కచ్చితంగా గుర్తిస్తాయి. మరి సిబ్బందిని ఎలా బోల్తా కొట్టించి మొబైల్‌ను ఈ ఆకతాయిలు లోనికి తీసుకెళ్లారన్నది ప్రశ్నార్థకం.

మొబైళ్లను క్యూ కాంప్లెక్స్ కంటే ముందే డిపాజిట్ చేశాకే లోనికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఘటన టీటీడీ భద్రత వైఫల్యాన్ని సూచించేదే. వైసీపీ హయాంలో తిరుమలలో జరిగిన అనేక ఘటనలు వివాదాస్పదమయ్యాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నీ చక్కబెడుతున్న సంకేతాలు వస్తుండగా.. ఇప్పుడీ ఘటన టీటీడీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చింది. దీనిపై టీటీడీ ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి.