ఆలోచ‌న మంచిదే.. ఆచ‌ర‌ణే క‌ష్టం ప‌వ‌న్ స‌ర్‌!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్.. గ‌త నెల రోజులుగా త‌న‌కు కేటాయించిన పంచాయ‌తీరాజ్‌, అట‌వీ, సైన్స్ అండ్ టెక్నాల‌జీ శాఖ‌ల‌పై దృష్టి పెట్టారు. వాటిపై రివ్యూలు కూడా చేస్తున్నారు. ఏయే శాఖ‌లో ప‌రిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. గ‌త వైసీపీ స‌ర్కారు ఆయా శాఖ‌ల‌ను ఏంచేసింది? నిధులు ఎన్ని వ‌చ్చాయి? వాటిని ఎటు మ‌ళ్లించారు? ఎన్ని నిధులు ఖ‌ర్చు చేశారు? ఇలా.. అనేక అంశాల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలుసుకున్నారు. ఇక‌, ఇప్పుడు ఆయ‌న ఆలోచ‌న‌ను ముందుకు తీసుకువెళ్లే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

అయితే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆలోచ‌న‌ల‌ను త‌ప్పుప‌ట్ట‌లేం.. కానీ, ఆచ‌ర‌ణే సాధ్యం కావ‌డం.. క‌ష్ట‌మ‌ని చెప్పాల్సి వ‌స్తోంది. ఎందుకంటే.. పంచాయ‌తీరాజ్ అయినా.. అట‌వీ శాఖ‌లైనా.. అనేక స‌మ‌స్య‌లతో ఉన్నాయి. ప్ర‌ధానంగా నిధుల సమ‌స్య పంచాయ‌తీరాజ్‌ను వెంటాడుతుంటే.. రాజ‌కీయ స‌మ‌స్య అట‌వీ శాఖ‌ను వెంటాడుతోంది. దీంతో రెండు శాఖ‌ల్లోనూ మార్పులు, సంచ‌ల‌న నిర్ణ‌యాలు కేవ‌లంగా గ‌తంలో అయినా.. ఇప్పుడైనా.. కాగితాల‌కే ప‌రిమిత‌మ‌య్యే ప్ర‌మాదం క‌నిపిస్తోంది.

ఉదాహ‌ర‌ణ‌కు ప‌వ‌న్ తీసుకున్న రెండు నిర్ణ‌యాలను గ‌మ‌నిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో అద్దం లాంటి ర‌హ‌దారుల‌ను నిర్మించాల‌న్న‌ది ఆయ‌న భావ‌న‌. ఇది మంచిదే. గ్రామాలు డెవ‌ల‌ప్ అయితే.. ఎవ‌రు మాత్రం కాదంటారు. కానీ, ఇక్క‌డే అస‌లు చిక్కు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కేంద్ర ‘స‌డ‌క్‌’ యోజ‌న అమ‌లు చేస్తోంది. కానీ, దీనిలో 70 శాతం నిధులు మాత్ర‌మే కేంద్రం ఇస్తుంది. మిగిలిన 30 శాతం రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే పెట్టుకోవాలి. పోనీ.. గ్రామాల నుంచి ఆదాయం ఉందా? అంటే అది కూడా లేదు.

సో.. దేశ‌వ్యాప్తంగా ఈ విష‌యంలో రాష్ట్రాలు వెనుక‌బ‌డి ఉన్నాయి. త‌మ వ‌ద్ద నిధుల్లేక అప్పులు చేసుకునే ప్ర‌భుత్వాలు.. గ్రామాల‌ను ప‌ట్టించుకునే తీరిక‌లేక స‌డ‌క్ యోజ‌నను ప‌క్క‌న పెట్టాయి. అయితే.. ప‌వ‌న్ మేలిమి సూచ‌న చేశారు. రాష్ట్ర స‌ర్కారు వాటాను 10 శాతానికి త‌గ్గించేలా కేంద్రాన్ని ఒప్పిస్తాన‌ని అన్నారు. కానీ, ఇది సాధ్యం కాదు. ఒక రాష్ట్రానికి ఒక‌ర‌కంగా.. మ‌రో రాష్ట్రానికి ఇంకోర‌కంగా గ్రామీణ వ్య‌వ‌స్థ‌కు సంబంధించి కేంద్రం వ్య‌వ‌హ‌రించ‌దు. దీనికి ప‌క్కా నియ‌మాలు, నిబంధ‌న‌లు ఉన్నాయి.

ఇక‌, మ‌రో నిర్ణ‌యం.. అట‌వీ సంర‌క్ష‌ణ, ఎర్ర‌చంద‌నం దోపిడీ. ఇది వాస్త‌వానికి ఏపీలో జ‌రుగుతున్న‌ట్టు భావిస్తున్నా.. దీనికి మూలాలు.. అంత‌ర్జాతీయంగా ఉన్నాయి. అంతేకాదు.. పొరుగు రాష్ట్రాల్లోనూ రాజ‌కీయంగా అక్ర‌మాలు ద‌న్నుగా ఉన్న వారు కూడా ఉన్నారు. మ‌న రాష్ట్రంలోనే ఈ విష‌యానికి వ‌చ్చేస‌రికి ప్ర‌త్య‌ర్థులు సైతం మిత్రులుగా క‌లిసిపోయిన ప‌రిస్థితి ఉంది. అందుకే.. ల‌క్ష‌ల ట‌న్నుల్లో అక్ర‌మ ర‌వాణా అవుతున్నా.. కేవ‌లం ఓ ప‌ది ప‌దిహేను దుంగ‌లు మాత్రమే దొరుకుతాయి! అంటే.. ఏ రేంజ్‌లో రాజ‌కీయ నెట్ వ‌ర్క్ ఉందో అర్థ‌మ‌వుతుంది. సో.. ఆలోచ‌న బాగానే ఉన్నా.. ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చేసరికి మాత్రం అంత ఈజీకాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.