బిగుస్తున్న ఉచ్చు .. కొడాలి నాని జాడెక్కడ ?!

వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా, గుడివాడ ఎమ్మెల్యేగా క్రిష్ణా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన కొడాలి నాని గత నెల రోజులుగా ఆచూకీ లేకుండా పోయాడు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద అవసరం ఉన్నా, లేకున్నా, వేదిక ఏదైనా ఏకవచనంతో మాట్లాడుతూ నోరు పారేసుకున్నాడు కొడాలి నాని. సంధర్భం, సమయంతో సంబంధం లేకుండా బూతు మాటలతో రెచ్చిపోయాడు.

కట్ చేస్తే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పడిపోయింది. నాలుగు సార్లు గుడివాడ ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని ఏకంగా 50 వేల ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యాడు. దీంతో టీడీపీ శ్రేణులు ఏకంగా కొడాలి నాని ఇంటిని ముట్టడించినా బయటకు రాలేదు. గత నెల రోజులలో రెండు సార్లు మాత్రమే కనిపించిన కొడాలి అసలు ఎక్కడ ఉంటున్నాడో కూడా అంతుబట్టడం లేదు.

తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కావడంతో గత పాలనలో చేసిన తప్పులకు సంబంధించి కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. ఎన్నికల సమయంలో వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించారు. దీంతో వాలంటీర్లు నానిపై కేసు పెట్టారు. ఆ తర్వాత బెవరేజెస్ గోడౌన్ లో లీజుదారు కూడా కేసు పెట్టాడు. ఈ రెండు కేసుల నుండి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నా తాజాగా వెలుగులోకి వచ్చిన బియ్యం స్కాం నాని మెడకు చుట్టుకునేలా ఉంది.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన సంధర్భంగా బియ్యం కుంభకోణం మీద విచారణకు ఆదేశాలు ఇచ్చారు. ఒక వైపు చంద్రబాబు, మరో వైపు పవన్ కళ్యాణ్, ఇంకో వైపు నారా లోకేష్ లు నానిని టార్గెట్ చేయడంతో అతని పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారయింది. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించకుండా అడ్డగోలుగా మాట్లాడడం మూలంగానే నానికి ఈ పరిస్థితి దాపురించిందని అంటున్నారు.

పార్టీ కార్యకర్తలకు కూడా నాని అందుబాటులో లేకపోవడంతో గతంలో అతని అనుచరులు అక్రమంగా ఆక్రమించుకున్న స్థలాలను స్థానికులు తిరిగి ఆక్రమించుకుంటున్నారని సమాచారం. 20 ఏళ్లు గుడివాడలో చక్రం తిప్పిన నాని ఇప్పుడు ఎటూ పాలుపోని సంకట స్థితికి చేరుకున్నాడు.