రాజీనామా విషయంలో రాజీ లేదంటున్న బీజేపీ !

తెలంగాణలో ఎనిమిది శాసనసభ, ఎనిమిది లోక్ సభ స్థానాలు గెలిచాం. 2028లో 88 శాసనసభ స్థానాలు గెలుచుకుని తెలంగాణలో కాషాయజెండా ఎగిరేస్తాం అని తెలంగాణ బీజేపీ నేతలు ఈ మధ్య తరచుగా చెబుతున్నారు. అయితే ఈ నేతల మాటలకు, ఆ పార్టీ చేతలకు పొంతన కుదరడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీవ్ర వత్తిడి చేసి తమ పార్టీలో చేర్చుకుంటుంది.

అయితే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మనసు ఒప్పని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారు. అయితే తమ పార్టీలోకి రావాలంటే పదవులకు రాజీనామా చేసి రావాలని బీజేపీ చెబుతున్న నేపథ్యంలో వారు వెనక్కు వస్తున్నట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వంలో ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల రాజీనామాల అంశాన్ని ముందు పెడుతూ బీజేపీ పెద్దలు ఖచ్చితంగా రాజీనామా చేయాలని అంటున్నారట.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి విద్యా సంస్థలు, ఆస్తులను టార్గెట్ చేసింది. దీంతో ఉక్కిరిబిక్కిరి అయిన వారు బెంగుళూరు వెళ్లి డీకె శివకుమార్ ను కలిసినా రేవంత్ తో ఉన్న వైరం కారణంగా కాంగ్రెస్ లో చేరికకు గ్రీన్ సిగ్నల్ దక్కలేదు. ఇక పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆయన సోదరులను కాంగ్రెస్ టార్గెట్ చేసింది.

దీంతో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీలోకి వెళ్లాలని మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డిలు ఆలోచించినట్లు సమాచారం. మహిపాల్ రెడ్డి ఏకంగా ఢిల్లీలో మకాం వేసి బీజేపీలో చేరిక కోసం ప్రయత్నించినా రాజీనామా చేయాలన్న షరతు మూలంగా వెనకడుగు వేసినట్లు తెలుస్తుంది. ఒక వైపు కాంగ్రెస్ వత్తిళ్లు, మరోవైపు బీజేపీ షరతులతో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి సైలెన్స్ మోడ్ లోకి వెళ్లినట్లు సమాచారం. పార్టీ బలపడాలంటే నేతలను చేర్చుకోవాలి. కానీ షరతులతో చేరికలకు చెక్ పెడితే భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది ఎలా అని కొందరు బీజేపీ శ్రేణులు అభిప్రాయపడుతుండడం గమనార్హం.