ఒకే రోజు రెండు సంస్థ‌లు.. ఏపీకి పెట్టుబ‌డుల ప‌రుగు

ఏపీలో ప్ర‌భుత్వం మారిన నెల రోజుల్లోనే పెట్టుబ‌డి దారులు ప‌రుగులు పెడుతున్నారు. వ‌స్తున్నాం.. పెట్టుబ‌డులు పెడుతున్నాం.. అని ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డంతోపాటు.. నేరుగా రంగంలోకి దిగి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతోనూ సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. త‌మ‌కు అవ‌స‌ర‌మైన విభాగాల‌పై ఆయ‌న‌తో చ‌ర్చిస్తున్నారు. తాముఎంత పెట్టుబ‌డి పెడుతున్న‌దీ చెబుతున్నారు. త‌మ‌కు అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించాల‌ని కోరుతున్నారు. ఇలా ఒక్క బుధ‌వార‌మే చంద్ర‌బాబుతో రెండు కీల‌క కంపెనీల ప్ర‌తినిధులు భేటీ కావ‌డం గ‌మ‌నార్హం.

విదేశీ కంపెనీ రాక‌..

ఏపీలో ప్ర‌భుత్వం మారిన ద‌రిమిలా.. విదేశీ కంపెనీలు కూడా రాక ప్రారంభించాయి. తాజాగా వియత్నాంకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘విన్ ఫాస్ట్’ ఏపీలో త‌మ విభాగం ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది. ఈ కంపెనీ ప్రతినిధి బృందం తాజాగా చంద్ర‌బాబును క‌లిసి..తమ ప్ర‌తిపాద‌న‌ల‌ను ఆయ‌న‌కు వివ‌రించింది. విన్ ఫాస్ట్ సీఈవో ఫామ్ సాన్ చౌతో కూడిన ప్ర‌తినిధి బృందం.. ఏపీలో విద్యుత్ ఆధారిత వాహనాలు, బ్యాటరీల తయారీ పరిశ్రమ స్థాపించాలని నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో త‌మ ప్ర‌తిపాద‌న‌ను చంద్ర‌బాబు ముందు పెట్టారు. దీనికి చంద్ర‌బాబు ఆహ్వానం ప‌లికారు. త్వ‌ర‌లోనే గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తామ‌న్నారు.

బీపీసీఎల్ రాక‌..

ఏపీలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కూడా పెట్టుబ‌డులు పెట్టేందుకు రెడీ అయింది. ఈ సంస్థ‌ ప్రతినిధులు కూడా చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. తూర్పు తీరంలో వ్యూహాత్మక స్థానంలో ఉన్న ఏపీలో గణనీయమైన పెట్రో కెమికల్ సామర్థ్యాలను వినియోగించుకునేందుకు పెట్రో కెమిక‌ల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. దీనికిగాను రూ.60 వేల కోట్ల నుంచి రూ.70 వేల కోట్లతో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు అంగీక‌రించారు. ఈ ప్ర‌తిపాద‌న‌ను స్వాగ‌తించిన చంద్ర‌బాబు.. దీనిపై 90 రోజుల్లో వివరణాత్మక నివేదికను కోరారు. మొత్తంగా చంద్ర‌బాబు రాక‌తో.. పెట్టుబ‌డులు ప‌రుగు పెట్ట‌డంపై ప్ర‌భుత్వ వ‌ర్గాలు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాయి.