కేంద్ర బడ్జెట్ పైనే చంద్రబాబు కోటి ఆశ‌లు..!

ప్రస్తుతం రాష్ట్రంలో ఏం చేయాలన్నా డబ్బులతో ముడిపడి ఉంది. పోలవరం కట్టాలన్నా.. అమరావతి రాజధాని నిర్మించాలన్నా.. కడపలో ఉక్కు ఫ్యాక్టరీని పట్టాలు ఎక్కించాలన్నా.. వెనుకబడిన జిల్లాలను ఆదుకుని అభివృద్ధి పనులు చేయాలన్నా.. ఏ రూపంలో చూసినా నిధులతో అయ్యే పనులే ఉన్నాయి. కానీ రాష్ట్ర ఆదాయాన్ని చూస్తే ఆ స్థాయిలో లేదు. పోనీ ఇప్పటికిప్పుడు ధరలు పెంచుదామా? అంటే తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించి జగన్మోహన్ రెడ్డిని ఓడించింది. సో దీనిని బట్టి చంద్రబాబు నాయుడు ముందు ఉన్న పరిస్థితిని గమనిస్తే ధరలు పెంచే అవకాశం లేకపోగా తగ్గించాలని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయిజ‌

మరి చంద్రబాబు నాయుడు విజన్ మేర‌కు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని నమ్మకం కారణంగా పోటెత్తిన ఓటర్ 164 స్థానాల్లో కూటమిని గెలిపించారు. దీంతో ఇప్పుడు ఆయన తన మార్కు పాలనను, తన మార్కు అభివృద్ధిని ఖచ్చితంగా చూపించాలి. ఇలా చేయాలంటే డబ్బులు కావాలి. మరి ఏం చేయాలి. ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో ఖజానా ఖాళీగా ఉంది. పైగా ఒకటో తారీకు వచ్చేసరికి పెంచిన పింఛన్ తో కలిపి లబ్ధిదారులకు వేల కోట్ల రూపాయల నిధులు సమకూర్చాలి. ఇక వేతనాలు, భత్యాలు మంత్రుల ఖర్చులు, అసెంబ్లీ ఎమ్మెల్యేల జీతాలు, మండలి జీతాలు ఇలా రకరకాలుగా డబ్బు ఖర్చు విపరీతంగా కనిపిస్తుంది.

మరోవైపు అభివృద్ధి కాముకుడిగా పేరు తెచ్చుకు చంద్రబాబుకు అభివృద్ధి చేయాల్సినటువంటి అగత్యం ఏర్పడింది. దీనిని ఉదాసీనంగా వదిలిపెట్టే అవకాశం లేదు. ఇప్పటికే నెల రోజులు అయిపోయింది ఏం చేశారనే ప్రశ్నలు చూచాగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపద్యంలో ఆయన ఆశలన్నీ ఇప్పుడు కేంద్రం పైన ఉన్నాయి. మరి కొద్ది రోజుల్లో కేంద్రం బడ్జెట్ పెట్టనుంది. దీనిలో ప్రధానంగా పోలవరం నిధులు, అమరావతి రాజధాని నిధులు.. వెనకబడిన జిల్లాలకు నిధులు.. విశాఖ రైల్వే జోన్ వంటి కీలక అంశాలపై చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు.

ఆయన ఢిల్లీ పర్యటన‌లో కూడా పెద్ద ఎత్తున నివేదికలు తీసుకువెళ్లి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర మంత్రులకు కూడా ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు వివరించారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన తప్పులను కూడా ఏకరువు పెట్టారు. మీరు ఆదుకోకపోతే రాష్ట్రం ఇబ్బందులు పడుతుందని చెప్పారు. అదే విధంగా ఎంతెంత కేటాయించాలో కూడా లెక్కలు గణాంకాలతో సహా వారికి వివరించారు. ఉదాహరణకు అమరావతి రింగ్ రోడ్డుకు సంబంధించి పదివేల కోట్లు అయినా ఇవ్వండి అని చంద్రబాబు అడిగారు. ఇక అమరావతి నిర్మాణానికి మరో 15 వేల కోట్లు అడిగారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికిప్పుడు కనీసం 3000 కోట్లు అయినా ఇవ్వాలని, బడ్జెట్లో 3 వేల కోట్లు కచ్చితంగా ప్రకటించాలని చంద్ర‌బాబు కోరారు. అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకు గతంలో ఇస్తామన్న 700 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఆయన ప్రతిపాదించారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు బడ్జెట్లో ప్రతిపాదనలు చేయాలని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఇవన్నీ ఇప్పుడు సాధ్యమవుతాయా వచ్చే ఆరు నెలల మాసానికి మాత్రమే ప్రవేశపెడుతున్న బడ్జెట్లో(అంటే ఆగస్టు నుంచి మార్చి వరకు) ఈ స్థాయిలో కేంద్రం ప్రకటిస్తుందా? అనేది సందేహమే.

ఎందుకంటే కేంద్రం అనుసరించే విధానాల్లో, కేంద్రం అమలు చేసే పథకాల్లో రాష్ట్రానికి కేంద్రానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఉచితాలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇస్తే కేంద్రం మాత్రం అన్నిటికి దూరంగా ఉంది. అసలు ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో కూడా బిజెపి భిన్న విధానం అవ‌లంభించింది. ఈ నేపథ్యంలో కేంద్రంపై బడ్జెట్ ఆశలు ఏ మేరకు ఫలిస్తాయి? చంద్రబాబు చెప్పిన ప్రతిపాదనలు ఏ మేరకు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది? బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉంటాయి? అనేది ఆర్థిక నిపుణులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.