వైఎస్ జ‌యంతి జాడేదీ.. ఊహించిందే జ‌రిగింది!!

వైసీపీ నాయ‌కులు ఏమ‌య్యారు? ఎక్క‌డున్నారు? తమ పార్టీ పేరులోనే ఉన్న ‘వైఎస్సార్‌’ 75వ జ‌యంతి రోజును పుర‌స్క‌రించుకుని వారు ఏం చేస్తున్నారు? అంటే.. కేవ‌లం ప్ర‌శ్న‌లు త‌ప్ప‌.. స‌మాధానాలు క‌నిపించ‌డం లేదు. వినిపించ‌డ‌మూ లేదు. కేవ‌లం తిరుప‌తి, శ్రీకాళ‌హ‌స్తి ప్రాంతాల్లో మాత్ర‌మే పార్టీ నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌చ్చి..రాజ‌న్న చిత్ర‌ప‌టానికి పూల‌మాలలు వేసి నివాళుర్పించారు. ఇత‌ర ప్రాంతాల్లో మాత్రం ఎక్క‌డా ఏ నాయ‌కుడూ.. అస‌లు వైఎస్ గురించి ప‌ట్టించుకున్న ప‌రిస్థితి కూడా క‌నిపించ‌లేదు.

వైఎస్సార్‌కు వీరాభిమానిన‌ని.. ఆయ‌న సీఎంగా ఉన్న‌ప్పుడు.. త‌న‌ను ప్ర‌త్యేకంగా పిలిచి వెంట బెట్టుకుని తిరిగార‌ని చెప్పుకొన్న మాజీ మంత్రి కొడాలి నాని కూడా ఎక్క‌డా వైఎస్సార్ జ‌యంతిని నిర్వ‌హించ‌లేదు. ఇక‌, వైఎస్ పేరును చేతిపై ప‌చ్చ వేయించుకున్న మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కూడా ఎక్క‌డా క‌నిపించ‌లేదు, ఇక‌, వైఎస్‌తో అనుబంధం ఉన్న ఒక‌ప్ప‌టి కాంగ్రెస్ నాయ‌కులు, ఇప్పుడు వైసీపీ నేత‌లుగా ఉన్న వారు కూడా ఎవ‌రూ రియాక్ట్ కావ‌డం లేదు. దీంతో వైఎస్ జ‌యంతి ఏపీలో ఒక్క క‌డ‌ప‌, తిరుప‌తి, శ్రీకాళ‌హ‌స్తి, అనంత‌పురం వంటి న‌గ‌రాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది.

గ‌తంలో..

గ‌త ఐదేళ్ల‌పాటు.. వైఎస్ జ‌యంతి(జూలై 8)ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఘ‌నంగా నిర్వ‌హించింది. ‘రైతు దినోత్సవం’ పేరుతో ఊరూ వాడా ఘ‌నంగా నిర్వ‌హించింది. ఆద‌ర్శ రైతుల‌కు బ‌హుమ‌తులు కూడా ఇచ్చి ప్రోత్సహించారు. అదేవిధంగా రైతుల‌కు ఇన్ పుట్ స‌బ్సిడీని కూడా అందించారు. ఇలా ఐదేళ్ల పాటు ఘ‌నంగా నిర్వ‌హించిన వైఎస్ జయంతిపై తాజా ఎన్నిక‌ల ఎఫెక్ట్ భారీగా ప‌డింది. వైసీపీ ఈ ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడి పోవ‌డంతో నాయ‌కులు కూడా అడ్ర‌స్ లేకుండా పోయారు. మ‌రి పార్టీ ప‌ని అయిపోయింద‌ని అనుకున్నారో.. లేక వైఎస్ జ‌యంతి అవ‌స‌రం లేద‌నుకున్నారో.. మొత్తానికి క‌ర‌డు గ‌ట్టిన వైఎస్ అభిమానులు కూడా మౌనంగా ఉండిపోవ‌డం గ‌మ‌నార్హం.