రెండు క‌మిటీలు.. అప్ప‌టికీ తేల‌క పోతే..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న విభ‌జ‌న అంశాల ప‌రిష్కారం కొలిక్కి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు ఇరు రాష్ట్రాల మంత్రులు ప్ర‌క‌టించారు. శ‌నివారం రాత్రి ప్ర‌జాభ‌వ‌న్‌లో జ‌రిగిన ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌మావేశం అనంత‌రం.. తెలంగాణ‌కు చెందిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, ఏపీకి చెందిన మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌లు ఉమ్మ‌డి ప్రెస్ మీట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. ప‌దేళ్లుగా అప‌రిష్కృతంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకునేందుకు శాంతియుత‌, చ‌ర్చా మార్గాల‌ను ఎంచుకున్న‌ట్టు తెలిపారు.

భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ.. ప‌దేళ్లుగా అనేక స‌మ‌స్య‌లు అప‌రిష్కృతంగా ఉన్నాయ‌ని.. వాటిని ప‌రిష్క‌రించేందుకు గ‌త ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోలేద‌న్నారు. తాము వ‌చ్చిన త‌ర్వాత‌.. చేప‌ట్టిన తొలి భేటీ ఆశాజ‌న‌కంగా సాగింద‌న్నారు. త్వ‌ర‌లోనే రెండు క‌మిటీల‌ను వేయ‌నున్న‌ట్టు చెప్పారు. మంత్రుల‌తో క‌మిటీ, అధికారుల‌తో మ‌రో క‌మిటీ వేస్తామ‌న్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఆయా క‌మిటీల్లో సీనియ‌ర్ అధికారులు, మంత్రులు ఉంటార‌ని తెలిపారు. వారు సూచించిన ప్ర‌కారం.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఉంటుంద‌న్నారు. ఒక‌వేళ‌.. అప్ప‌టికీ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భించ‌క‌పోతే.. మ‌రోసారి ముఖ్య‌మంత్రుల స‌మావేశం ఉంటుంద‌న్నారు.

ఏపీకి చెందిన మంత్రి అన‌గాని మాట్లాడుతూ.. దాదాపు ఇదే విష‌యాన్ని చెప్పారు. మంత్రుల క‌మిటీ వేసేందుకు రెండు వారాల స‌మ‌యం పండుతుంద‌ని.. అక్క‌డి నుంచి ఎప్పుడు నివేదిక వ‌స్తే.. దాని ప్ర‌కారం.. విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకునేందు కు అవ‌కాశం ఉంటుంద‌న్నారు. ఇదొక మంచి నిర్ణ‌య‌మ‌న్నారు. అదేవిధంగా అధికారుల‌తో కూడిన క‌మిటీ కూడా.. వేస్తామ‌న్నా రు. దీనిలో ఏపీ నుంచి కూడా ఉన్న‌తాధికారులు ఉంటార‌ని.. వారు విభ‌జ‌న‌చ‌ట్టంలోని ప్ర‌తి అంశాన్నీ కూలంక‌షంగా ప‌రిశీలించి.. నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని అన్నారు.

ఇక‌, ఇరు రాష్ట్రాలు కూడా.. కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌పై ఉమ్మ‌డి పోరాటం చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు ఇరు రాష్ట్రాల మంత్రులు చెప్పారు. అదేస‌మ‌యంలో విభ‌జ‌న చ‌ట్టంతో సంబంధం లేని మ‌రికొన్ని అంశాల‌ను కూడా చ‌ర్చించిన‌ట్టు తెలిపారు. దీనిలో గంజాయి, డ్ర‌గ్స్ నియంత్ర‌ణ‌కు ఏపీతో క‌లిసి తెలంగాణ అధికారులు సంయుక్తంగా ప‌నిచేయ‌నున్న‌ట్టు వివ‌రించారు. ఇరు రాష్ట్రాల అధికారులు గంజాయి ర‌వాణా, డ్ర‌గ్స్ ర‌వాణాల‌ను అడ్డుకునేందుకు సంయుక్త కార్యాచ‌ర‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్టు వివ‌రించారు. కీల‌క‌మైన విద్యుత్‌, జ‌లాల పంపిణీపైనా క‌మిటీలు తీసుకునే నిర్ణ‌యాల‌ను ప‌రిశీలించ‌నున్న‌ట్టు మంత్రులు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతానికి క‌మిటీల ఏర్పాటు వ‌ర‌కే చ‌ర్చ‌లు జ‌రిగాయ‌న్నారు.