అడ్డంగా ఇరుక్కున్న మార్గాని భరత్

అధికారంలో ఉండగా ఏం చేసినా చెల్లుతుంది. కానీ అధికారం పోగానే తాడు కూడా పామై చుట్టుకుంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నాయకుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అదృష్టం కలిసొచ్చి 2019లో వైసీపీ వేవ్‌లో రాజమండ్రి ఎంపీగా గెలిచేసిన మార్గాని భరత్.. గత ఐదేళ్లలో ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నాడు.

పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ అంటూ ఆయన మీద తరచుగా విమర్శలు వచ్చేవి. ఆయన పబ్లిసిటీ పిచ్చి గురించి చాలాసార్లు చర్చ జరిగింది. ఐతే మొన్నటి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన భరత్‌ను ఇంకా పబ్లిసిటీ మోజు వదల్లేదనడానికి తాజా ఉదంతం రుజువుగా నిలుస్తోంది. జనాల్లో సింపతీ కోసం తన ఎన్నికల ప్రచార రథాన్నే తన మనుషులతోనే తగలబెట్టించుకున్నట్లు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

గత నెల 28న మార్గాని భరత్ ఎన్నికల ప్రచార వాహనం అగ్నికి ఆహుతైంది. ఇది ప్రత్యర్థి పార్టీ వాళ్లే చేశారంటూ భరత్ ఆరోపించాడు. కాగా వారం రోజుల్లో విచారణ పూర్తి చేసిన పోలీసులు.. భరత్‌ తండ్రి మార్గాని నాగేశ్వరరావు ముఖ్య అనుచరుడైన శివ అనే వ్యక్తే ఈ వాహనానికి నిప్పు పెట్టినట్లు వెల్లడించారు.

స్వయంగా డీఎస్పీ కిశోర్ ఈ విషయంపై ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టారు. గత నెల 28న శివ తన అనుచరులతో కలిసి మందు కొట్టిన అనంతరం రాత్రి పదిన్నర ప్రాంతంలో తన బైక్ నుంచి పెట్రోలు తీశాడని.. తర్వాత దోమల చక్రం, అగ్గిపెట్టె కొని వీటి సాయంతో వాహనానికి నిప్పు పెట్టాడని డీఎస్పీ వెల్లడించారు. ఐతే భరత్ లేదా ఆయన తండ్రి సూచన మేరకు శివ ఇదంతా చేశాడని పోలీసులేమీ పేర్కొనలేదు.

ఈ ప్రమాదం ఎలా జరిగింది.. అందులో శివ ప్రమేయం ఎంత అన్నది మాత్రమే వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానే ఈ కేసును ఛేదించినట్లు తెలిపారు. కానీ భరత్ సింపతీ కోసమే ఇదంతా చేయించాడని టీడీపీ, జనసేన వర్గీయులు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఇదే అభిప్రాయపడుతున్నారు.