అర్దరాత్రి ఆరుగురు ఎమ్మెల్సీలు !

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్‌కి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ ఢిల్లీ నుంచి రాగానే గురువారం అర్దరాత్రి కాంగ్రెస్‌లోకి తీర్దం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ వారికి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాజా చేరికలతో మండలిలో కాంగ్రెస్ బలం 12కి చేరింది. ఎమ్మెల్సీలు మీడియా కంట పడకుండా వెనుక గేట్‌ నుంచి సీఎం రేవంత్ ఇంటి లోపలికి వెళ్లారు. ఇప్పటికే ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి చేరగా తాజాగా చేరిన ఎమ్మెల్సీలతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు హీటెక్కాయి.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, దండే విఠల్, భానుప్రసాద్, ప్రభాకర్‌రావు, దయానంద్, ఎగ్గే మల్లేష్ కాంగ్రెస్ లో చేరిన వారిలో ఉన్నారు. తెలంగాణ మండలిలో మొత్తం ఎమ్మెల్సీల సంఖ్య 40 అయితే.. ప్రస్తుతం రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగతా 38మందిలో కాంగ్రెస్‌కు నిజానికి నలుగురు మాత్రమే ఉన్నారు. మిగతా 8మంది బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చినవాళ్లే. ఇక బీజేపీకి ఒకరు, ఎంఐఎంకు ఒక ఎమ్మెల్సీ ఉండగా.. ఇద్దరు ఇండిపెండెంట్స్‌ ఉన్నారు.

ప్రస్తుతం మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల బలం 21కి తగ్గింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ లో ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు చేరారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.