వలంటీర్లకు మంగళమేనా?

AP Volunteers

ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉండగా ప్రవేశ పెట్టిన వలంటీర్ల వ్యవస్థ గురించి గత నాలుగేళ్లలో ఎంత చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారని భావించిన వలంటీర్ల గురించి అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్షాల్లో ఎన్నో వాదోపవాదాలు, విమర్శలు ప్రతి విమర్శలు నడిచాయి.

చివరికి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు.. వలంటీర్ల గురించి ఎన్నికల సమయంలో సానుకూలంగా మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వారి జీతాలను రూ.10 వేలకు పెంచుతామని ప్రకటించడం అప్పట్లో చర్చనీయాంశం అయింది.

దాదాపు రెండున్నర లక్షల మంది ఉన్న వలంటీర్లను ఎందుకు దూరం చేసుకోవడం అన్న ఉద్దేశంతో ఆయన ఆ ప్రకటన చేసి ఉండొచ్చు. కానీ వలంటీర్లలో 90 శాతం మంది వైసీపీ వాళ్లే అని ఆ పార్టీ నేతలే ప్రకటించడం మరవకూడదు.

ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం వలంటీర్ల విషయంలో ఏం చేస్తుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై నాలుగు వారాలు గడుస్తుండగా.. వలంటీర్ల గురించి ఉలుకూ పలుకూ లేదు.

వలంటీర్లలో సగం మంది రాజీనామాలు చేయగా.. మిగతా వారికి ఈ నెల జీతం ఇవ్వలేదు. ఇప్పుడున్న వలంటీర్లను పక్కన పెట్టి వారి స్థానంలో టీడీపీ, జనసేన వాళ్లను నియమించుకుంటారా.. లేక మొత్తంగా ఈ వ్యవస్థనే రద్దు చేస్తారా అన్న ప్రశ్న అందరిలోనూ ఉంది. ఐతే ఈ రోజు పింఛన్ల పంపిణీ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే వలంటీర్ల వ్యవస్థ కొనసాగడం కష్టమే అనిపిస్తోంది.

పింఛన్ల పంపిణీ బాధ్యతను సచివాలయ సిబ్బందికి అప్పగించి విజయవంతంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్న నేపథ్యంలో వలంటీర్లు లేకున్నా పింఛన్లు ఆగలేదు కదా అని పవన్ మాట్లాడారు. వలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడానికి ప్రయత్నిస్తామని అన్నారు కానీ.. పింఛన్ల పంపిణీ ఇతర అవసరాలకైతే వాళ్లు అవసరం లేదన్నట్లే ఉంది పవన్ వ్యాఖ్యల్ని బట్టి చూస్తే.