ఈ పూరి గుడిసె.. ఇప్పుడు ‘టాక్ ఆఫ్ ది స్టేట్‌!’

పై ఫొటోలో క‌నిపిస్తున్న పూరి గుడెస‌.. ఇప్పుడు ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్‌ది న్యూస్‌గా మారిపోయింది. పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలోనూ ఈ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. సాధార‌ణంగా పూరి గుడిసెల గురించి ఎవ‌రు మాత్రం ప‌ట్టించుకుం టారు? అవి ఎందుకు వార్త‌ల్లో నిలుస్తాయి? అనే సందేహాలు వ్య‌క్తం కావ‌చ్చు. అయితే.. తాజాగా ఇటు సోష‌ల్ మీడియాలోనూ.. అటు ప్ర‌ధాన మీడియాలోనూ వైర‌ల్ అవుతున్న ఈ ఫొటో వ్య‌వ‌హారం వెనుక చాలా పెద్ద స్టోరీనే ఉంది. దీనికి ఎంతో ప్రాధాన్యం కూడా ఏర్ప‌డింది. కార‌ణం.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సోమ‌వారం పొద్దు పొద్దున్నే.. ఈ ఇంటికి వెళ్లారు.

ఇంతకీ ఈ పూరి గుడిసె ఎక్క‌డుందంటే.. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని అమ‌రావ‌తి రాజ‌ధానికి స‌మీపంలో ఉన్న పెనుమాక‌లో ఉంది. ఈ ఇంటికే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సోమ‌వారం ఉద‌యం 6 గంట‌ల‌క‌ల్లా వెళ్ల‌నున్నారు. సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న ఇక్క‌డ నుంచే ప్రారంభించ‌నున్నారు. రాష్ట్రంలో పింఛ‌న్ల పంపిణీ ఎప్ప‌టి నుంచో జ‌రుగుతున్నా… చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. మొన్న‌టి వ‌ర‌కు ఉన్న రూ.3 వేల పింఛ‌నును రూ.4000ల‌కు పెంచారు. అదేవిధంగా ఏప్రిల్‌-జూన్ మ‌ధ్య మూడు మాసాల పింఛ‌ను(పెంచిన మొత్తం) మొత్తం క‌లిపి ఈరోజు అందించారు.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు స‌ర్కారు సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల పంపిణీని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. స్వ‌యంగా చంద్ర‌బాబు పొద్దు పొద్దున్నే ఆరు గంట‌ల‌క‌ల్లా.. పెనుమాక‌లోని పైఫొటోలో ఉన్న ఇంటి నుంచే ఈ పంపిణీని ప్రారంభించారు. ఆ త‌ర్వాత‌.. రాష్ట్ర వ్యాప్తంగా పింఛ‌న్ల పంపిణీ చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు స‌హా ప్ర‌జా ప్ర‌తినిధులు. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఓ పండుగ వాతావ‌ర‌ణంలో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించేందుకు స‌ర్కారు స‌న్నాహాలు పూర్తి చేసింది.

ఎవ‌రిదీ ఇల్లు!

ఇక‌, సోష‌ల్ మీడియాలోనూ.. ప్ర‌ధాన మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ ఇంటి విష‌యానికి వ‌స్తే.. పెనుమాక‌లోని రైతుల కుటుంబం. ఈ ఫొటోలో నిల‌బ‌డిన వారు.. తండ్రీ కుమార్తెలు. తండ్రి దివ్యాంగుడు. కుమార్తె ఒంట‌రి మ‌హిళ‌. దీంతో ఇద్ద‌రికీ.. పింఛన్లు అందుతున్నాయి. ఇప్పుడు స్వ‌యంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వీరి ఇంటికి వ‌చ్చి.. పెంచిన ఫించ‌న్ల‌ను అందించ‌నున్నారు. దీంతో ఇప్పుడు ఈ పూరి గుడిసె టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయింది. ప్ర‌స్తుతం ఈ కుటుంబ స‌భ్యుల గురించే అంద‌రూ మాట్లాడుకుంటుండ‌డం విశేషం.