జ‌గ‌న్‌ను ఇలా కూడా ‘ఆడేసుకుంటాన్నారుగా’!

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ తాజా ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత‌.. ఆయ‌నపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్‌, మీమ్స్ వ‌చ్చాయి. ఇంకా వ‌స్తూనే ఉన్నాయి.

ఆయ‌న గ‌తంలో తీసుకున్న నిర్ణ‌యాలు.. మూడు రాజ‌ధానులు, పోల‌వ‌రం, అమ‌రావ‌తి విధ్వంసం వంటి వాటిని నెటిజ‌న్లు గుర్తు చేస్తూ… త‌మ‌దైన శైలిలో ఉతికి ఆరేస్తున్నారు. కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు. ఇక‌, రాజ‌కీయంగా చంద్ర‌బాబు కూడా.. నిరంత‌రం.. వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు.

అయితే.. ఇప్పుడు తాజాగా నెటిజ‌న్లు.. మ‌రో కోణంలోనూ.. జ‌గ‌న్‌ను ఆడేస్తున్నారు. తాజాగా ద‌క్షిణాఫ్రికా-భార‌త్ జ‌ట్ల మ‌ధ్య టీ-20 క్రికెట్ మ్యాచ్ జ‌రిగింది. ఇది తీవ్ర ఉత్కంఠ‌గా సాగింది. భార‌త జ‌ట్టు గెలుస్తుందా? లేదా? అనే సందేహం కూడా.. వెంటాడింది.

క్రికెట్ ప్రియులు రోమాలు నిక్క‌బొడుచుకుని మ‌రీ శ‌నివారం రాత్రి జ‌రిగిన క్రికెట్ ను వీక్షించారు. అనుక్ష‌ణం టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌.. చివ‌ర‌కు భార‌త్ విజ‌యం ద‌క్కించుకుం ది. 7 ప‌రుగుల తేడాతోనే అయినా.. ఘ‌న విజ‌యం సొంతం చేసుకుంది.

ఈ ప‌రిణామాన్ని జ‌గ‌న్ వ‌ర్సెస్ చంద్ర‌బాబుకు అన్వ‌యిస్తూ.. నెటిజ‌న్లు పోస్టులు పెడుతున్నారు. ఒక ర‌కంగా కుమ్మేస్తున్నార‌నే చెప్పాలి. ద‌క్షిణాఫ్రికా-భార‌త్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన ఉత్కంఠ పోరును.. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో కూట‌మి-వైసీపీ పార్టీల మ‌ధ్య జ‌రిగిన పోరుతో పోలుస్తున్నారు.

ఈ ఎన్నిక‌లు కూడా.. తీవ్ర ఉత్కంఠ‌ను తీసుకువ‌చ్చారు. ఎవ‌రూ కూడా ఎవ‌రు విజ‌యం సాధిస్తార‌నే విష‌యాన్ని అంచ‌నా వేయ‌లేక పోయారు. అంతేకాదు.. చివ‌రి నిముషం వ‌ర‌కు కూడా.. అస‌లు గెలుపుపై ఎవ‌రూ ఊహించ‌లేదు.

ద‌క్షిణాఫ్రికా-భార‌త్ జ‌ట్ల మ‌ధ్య కూడా.. ఇలానే పోరు సాగ‌డంతో ఏపీ ఎన్నిక‌ల‌ను ఈ పోరు త‌ల‌పించింద‌ని నెటిజ‌న్లు పోస్టులు పెడుతున్నారు. ఇక‌, ఈ ఉత్కంఠ పోరులో ద‌క్షిణాఫ్రికా ప‌రాజ‌యం పాలైంది. భార‌త్ గెలిచింది. దీనిని రాజ‌ధానుల‌ను అన్వ‌యిస్తున్నారు.

ఎలాగంటే..ద‌క్షిణాఫ్రికాకు మూడు రాజ‌ధానులు (కేప్ టౌన్‌, ప్రెటోరియా, బ్లోమ్ ఫాంటైన్‌) ఉన్నాయి. కానీ, ఇది ఓడిపోయింది. అలానే.. మూడు రాజ‌ధానులు అంటూ.. రాజ‌కీయాలు చేసిన జ‌గ‌న్ కూడా ఓడిపోయార‌ని నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక‌, ఏకైక రాజ‌ధాని(ఢిల్లీ) ఉన్న భార‌త్ టీ-20లో విజ‌యం సాధించింది. దీనిని చంద్ర‌బాబుకు అన్వ‌యిస్తూ.. ఆయ‌న ఎంచుకున్న ఏకైక రాజ‌ధాని(అమ‌రావ‌తి) విజ‌యం ద‌క్కించుకుంద‌ని నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. మొత్తంగా సంద‌ర్భం ఏదైనా.. కూడా జ‌గ‌న్‌ను అయితే.. నెటిజ‌న్లు వ‌దిలి పెట్ట‌క పోవ‌డం గ‌మ‌నార్హం. దీనిపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.