విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్హత, వసతి బకాయిల కారణంగా సర్టిఫికెట్లు అందని విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేయాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వం పెట్టిన‌ రూ.3480 కోట్ల బకాయిల వల్ల లక్షలాది మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లో ఉన్నాయని తెలిపారు. విద్యాసంస్థలతో మాట్లాడి ముందు విద్యార్థులకు సర్టిఫికెట్లు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకుల పోస్టుల భర్తీకి చర్యలు…. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాల పెంపుదల, పాఠ్యాంశాల్లో మార్పులు, విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు పాఠ్యాంశాల్లో మార్పులు, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు, మౌలిక వసతుల కల్పన. ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలు తదితర నిధుల వినియోగంపై లోకేష్ సమీక్షించారు.

ఈ మేరకు సమీక్ష అనంతరం లోకేష్ ట్వీట్ చేశారు. ‘‘ఉన్నత విద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాను. విద్యాదీవెన, వసతిదీవెన కింద వైకాపా ప్రభుత్వం రూ.3,480 కోట్లు బకాయిలు పెట్టడం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించాను. విద్యాసంస్థలతో మాట్లాడి ముందు విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించాలని సూచించాను.

యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చేపట్టాల్సిన చర్యలు, ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాల పెంపు, కరిక్యులమ్‌లో మార్పులు, విద్యార్థుల్లో నైపుణ్యత పెంచడానికి పాఠ్యాంశాల్లో మార్పులు, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులు, ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన, అడ్మిషన్ల పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలు, రూసా నిధుల వినియోగంపై సమీక్షించాను’’ అని పేర్కొన్నారు.