పండుగ‌లా పింఛ‌న్లు.. చంద్ర‌బాబు తాజా ఆదేశం!

మ‌రో రెండు రోజుల్లో ఏపీలో పంపిణీ చేయ‌నున్న సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల విష‌యంపై సీఎం చంద్ర‌బాబు తాజాగా టీడీపీ నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. పింఛ‌న్ల పంపిణీని పండుగ‌లా చేప‌ట్టాల‌న్నారు. జూలై 1వ తేదీన జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి నాయకుడు సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొనాలని ఆదేశించారు. మండల, టౌన్ పార్టీ అధ్యక్షులు, డివిజన్, వార్డు అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ ఇన్‌చార్జ్‌లు, ఇతర పదవుల్లో ఉన్న టీడీపీ నాయకులు ఆయా సచివాలయం పరిధిలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని సూచించారు.

అదేవిదంగా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, పార్టీ ఇన్‌చార్జ్‌, టీడీపీ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు నియోజకవర్గంలోని అన్ని ఏరియాలలో కవర్ అయ్యే విధంగా కనీసం 10 మంది లబ్ధిదారులకు పైగా పెన్షన్లను పంపిణీ చేయాల‌ని చంద్ర‌బాబు ఆదేశాల్లో పేర్కొన్నారు. అంతేకాదు.. పింఛ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని హైలెట్ చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టాల‌న్నారు. ఆ రోజు మొత్తం నాయకులందరూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంపైనే ఉండాలని ఆదేశించారు. అలానే త‌న మంత్రివ‌ర్గంలోని ముఖ్య నాయ‌కుల‌ను కూడా.. చంద్ర‌బాబు ఆదేశించారు. మంత్రులు సైతం జిల్లాల స్థాయిలో జ‌రిగే పింఛ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని అన్నారు.

ఎందుకీ హ‌డావుడి!

పింఛ‌న్ల పంపిణీ సాధార‌ణంగా ప్ర‌తినెలా 1వ తేదీనే జ‌రుగుతోంది. అయితే.. చంద్ర‌బాబు ఇప్పుడు ఎందుకు ఇంత‌గా ప్ర‌చారం చేయాల‌ని కోరుకుంటున్నారు? ఎందుకు ఇంత‌మంది నాయ‌కుల‌ను కూడా రంగంలోకి దింపుతున్నారు? అనేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి స‌ర్కారు ఏపీలో కొలువుదీరి 20 రోజులు మాత్ర‌మే అయింది.

ఇంత త‌క్కువ స‌మ‌యంలోనే స‌ర్కారు.. ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీ మేర‌కు పింఛ‌న్ల‌ను రూ.3000 నుంచి రూ.4000ల‌కు పెంచి ఇస్తోంది. ఇలా .. ఒకే విడ‌త‌లో రూ.1000 చొప్పున పెంచిన ప్ర‌భుత్వం లేదు. ఇక‌, దివ్యాంగుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు రూ.3000 గా ఉన్న పించ‌నును 6000ల‌కు అంటే డ‌బుల్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే పింఛ‌న్ల పంపిణీని చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు.

ఎవ‌రెవ‌రికి ఎంతెంత‌?

  • వృద్ధులు, వితంతువులు, ఒంట‌రి మ‌హిళ‌లకు రూ.3000గా ఉన్న పింఛ‌ను రూ.4 వేలకు పెంచి ఇస్తారు.
  • దివ్యాంగుల‌కు రూ.3000గా ఉన్న పింఛ‌నును రూ.6 వేల‌కు పెంచి ఇస్తారు.
  • త‌ల‌సేమియా వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌వారికి రూ.5 వేలుగా ఉన్న పింఛ‌ను ను రూ.10 వేల‌కు పెంచి ఇస్తారు.
  • కిడ్నీ వ్యాధిగ్ర‌స్థుల‌కు రూ.5 వేలుగా ఉన్న పింఛ‌నును రూ.15 వేల‌కు పెంచి ఇస్తారు.
  • కాగా.. వృద్ధులు, వితంతువులు, ఒంట‌రి మ‌హిళ‌ల పింఛ‌నును ఏప్రిల్ నుంచి లెక్క‌గ‌ట్టి.. మ‌రో రూ.3 వేల‌ను అద‌నంగా ఇస్తారు.
  • దివ్యాంగుల పింఛ‌నును కూడా ఏప్రిల్ నుంచి లెక్క‌గ‌ట్టి పెంచి ఇవ్వ‌నున్నారు.