పెద్దిరెడ్డి : నాటి పాపం .. నేటి శాపం !

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వెలువడి 20 రోజులు దాటింది. ఎన్నికైన ఎమ్మెల్యేలు అంతా శాసనసభలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఎవరికి వారు తమ నియోజకవర్గాలకు వెళ్లి తమకు ఓట్లేసిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పుకున్నారు. కానీ గత ప్రభుత్వంలో మంత్రిగా ఒక వెలుగు వెలిగిన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి 20 రోజులు దాటినా పుంగనూరులో అడుగుపెట్టలేకపోతున్నారు.

ఇటీవల ఎన్నికలలో పెద్దిరెడ్డి టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డిపై 6095 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించాడు. 1978 నుండి రాజకీయాల్లో ఉన్న పెద్దిరెడ్డి 1978, 1985, 1994లో పీలేరు నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. 1989, 1999, 2004లో పీలేరు నుండి, 2009, 2014, 2019, 2024 ఎన్నికల్లో పుంగనూరు నుండి పోటీ చేసి విజయం సాధించాడు. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట లోక్ సభ స్థానం నుండి 2014, 2019, 2024లో విజయం సాధించడం విశేషం.

తన కనుసైగలతో సీమ జిల్లాలను శాసించిన పెద్దిరెడ్డి అధికారంలో ఉండగా చేసిన అరాచకాలు ఇప్పుడు ఆయనను వెంటాడి వేధిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కుప్పంలో చంద్రబాబును, హిందూపురంలో బాలక్రిష్ణను ఓడిస్తానని, కుప్పంలో బాబును అడుగుపెట్టనివ్వనని పెద్దిరెడ్డి అనేకమార్లు సవాల్ విసిరాడు.

పోలీసుల అండతో గతంలో చంద్రబాబును కుప్పంలో అడుగుపెట్టనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన పెద్దిరెడ్డి ఇప్పుడు పుంగనూరులో అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఇప్పటికి రెండు, మూడు సార్లు నియోజకవర్గానికి వెళ్లే ప్రయత్నం చేసినా టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్న నేపథ్యంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు అనుమతించడం లేదు.

ఇంతటి పరిస్థితి రావడానికి కారణం గత ఐదేళ్లలో పెద్దిరెడ్డి వ్యవహరించిన తీరే అని అంటున్నారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పుంగనూరు పర్యటనకు వస్తే రాళ్ల దాడులు చేయించడం, అంగళ్లులో టీడీపీ క్యాడర్‌పై దాడులకు దిగడం వంటి సంఘటనల నేపథ్యంలో పెద్దిరెడ్డి రాకను టీడీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. చంద్రబాబు అరెస్టు సమయంలో శ్రీకాకుళం నుండి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేసిన టీడీపీ కార్యకర్తల మీద పుంగనూరులో దాడి జరిగితే కనీసం కేసులు కూడా పెట్టకపోవడాన్ని టీడీపీ క్యాడర్ జీర్ణించుకోలేక పోతుంది. అందుకే నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో తొలిసారి అత్యంత చేధు అనుభవాలను పెద్దిరెడ్డి మూటగట్టుకుంటున్నాడని అంటున్నారు.